తెలంగాణ లో కొత్త పార్టీ తో షర్మిల దూసుకువస్తున్నారు.ఈ రోజు పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇక శరవేగంగా రాజకీయాల్లో దూసుకుపోతూ అధికారంలోకి రావాలి అనే పట్టుదలతో షర్మిల ఉన్నారు.గత నాలుగు నెలలుగా షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు విషయమై హడావుడి చేస్తూనే ఉన్నారు.
జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.బలమైన రాజకీయ పార్టీ గా నిరూపించుకునేందుకు బలమైన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
తన ఇమేజ్ కు డ్యామేజ్ అవుతుంది అని తెలిసినా, కృష్ణ జలాల విషయమై ఆమె మాట్లాడుతున్నారు. తనకు , తన పార్టీ వైఎస్సార్ టీపీకి తెలంగాణలో ఆదరణ బాగుంటుంది అని, ముఖ్యంగా తన తండ్రి రాజశేఖర రెడ్డి చరిష్మా బాగా ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో ఆమె ఉన్నారు.
ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంతో పాటు, వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో బాగా లబ్ధి పొందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల మద్దతు తో తాను రాజకీయంగా సక్సెస్ అవుతాను అనే నమ్మకంతో ఆమె ఉన్నారు.ఇప్పటి వరకు పార్టీలో పెద్దగా చేరికలు లేకపోయినా, ఈ రోజు పార్టీ పేరుని అధికారికంగా ప్రకటించిన తరువాత భారీ స్థాయిలో చేరికలు ఉంటాయి అనే నమ్మకంతో ఆమె ఉన్నారు.
అయితే రాజశేఖరరెడ్డి చరిష్మ షర్మిలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే విషయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.వైఎస్ కు తెలంగాణలో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నా, వారంతా షర్మిల పార్టీ తరపున ఎంతవరకూ నిలబడతారు అనేది అనుమానమే.ఎందుకంటే వైఎస్ అభిమానుల్లో రాజకీయ నాయకులు చాలా మందే ఉన్నా , వారంతా ఎప్పుడో వివిధ పార్టీల్లో చేరిపోయారు.కొంతమంది టీఆర్ఎస్ లో మంత్రులుగా ఉన్నారు.కాంగ్రెస్ , బీజేపీల్లోనూ కీలక పదవుల్లో ఉండడంతో వారు షర్మిల పార్టీ వైపు వచ్చే అవకాశం ఉండదు.అలాగే బలమైన పార్టీలుగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లను కాదని షర్మిలను నమ్ముకుని వైయస్సార్ టిపి లో భారీ స్థాయిలో అయితే చేరికలు ఉండే అవకాశం అంతంత మాత్రమే.