ప్రస్తుతం డెంగ్యూ జ్వరాలు విపరీతంగా విజృంభిస్తున్నాయి.నిన్న మొన్నటి వరకు కరోనా మరణ మృదంగం మోగించగా.
ఇప్పుడు డెంగ్యూ ఊపందుకుంది.దీంతో అటు ప్రభుత్వ ఆసుపత్రులు, ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు డెంగ్యూ రోగులతో కిట కిటలాడుతున్నాయి.
అయితే డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడే కాదు.పోయాక కూడా కొన్ని జాగ్రత్తలను ఖచ్చితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరి ఆ జాగ్రత్తలు ఏంటో ఆలస్యం చేయకుండా ఓ చూపు చూసేయండి.

సాధారణంగా డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది.ఈ విషయంలో ఆందోళన చెందకుండా నట్స్, చేపలు, రొయ్యలు, బచ్చలికూర, పాలకూర, స్ట్రాబెర్రీస్, అరటి, ఆపిల్, ద్రాక్ష, మామిడి, మెంతులు, పాల ఉత్పత్తులు, మొలకెత్తిన పప్పు ధాన్యాలు, గుడ్లు వంటి ఆహారాలను డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికే కాకుండా జుట్టుకు సైతం మంచి పోషణ అంది రాలడం తగ్గుతుంది.
అలాగే డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారి పోతుంది.
అందుకే డెంగ్యూ వచ్చి పోయాక త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి.లేదంటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
డెంగ్యూ జర్వం వచ్చిన తర్వాత కీళ్లు, కండరాల నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.వీటిని తగ్గించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం చేస్తుంటారు.
కానీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకుంటే.ఆ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇక డెంగ్యూ తగ్గినా నీరసం, అలసట వంటివి అంత త్వరగా పోవు.కాబట్టి, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఓట్స్, ఎండు ఫలాలు, గ్రీన్ టీ వంటివి తీసుకోవడంతో పాటు విశ్రాంతి కూడా ఎక్కువ తీసుకోవాలి.తద్వారా నీరసం, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.