సూర్యాపేట జిల్లా:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును గుత్తి కోయలు దాడిచేసి హత్య చేయడం దారుణమని జిల్లా అటవీ శాఖ అధికారి వి.సతీష్ బాబు అన్నారు.
ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు మృతికి నిరసనగా శనివారం జిల్లా కేంద్రంలో సామిల్ కార్మికులతో కలిసి జిల్లాలోని ఫారెస్ట్ అధికారులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖ అధికారులకు రక్షణ లేకుండా పోయిందని,యూనిఫాం సిబ్బందిపై దాడులు జరగడం సర్వసాధారణం అయిపోయాయని అవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అటవీ శాఖ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలన్నారు.పోడు భూముల సర్వే సందర్భంగా జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని,ఆ సమయంలో పోలీసుల సహకారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట బీట్ ఆఫీసర్ మాచర్ల అచ్చయ్య,ఇతర సిబ్బంది,సామిల్ మిల్లు యాజమాన్యం, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.