సోషల్ మీడియాలో దిగ్గజం ఫేస్బుక్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నా… ఎప్పుడూ ఏదో ఒక లోపం తలెత్తుతూ ఉండడం… ఆ లోపం కారణంగా….తమ యూజర్స్ కి క్షమాపణలు చెప్పడం జరుగుతూనే ఉన్నాయి.
అయితే తరుచూ ఇటువంటి లోపాలు తలెత్తుతూ ఉండడంతో యూజర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంతకు ముందే… యూజర్ల డేటా దుర్వినియోగం, ఖాతాల హ్యాకింగ్ లాంటి వివాదా లతో సతమ తమవుతున్న ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ ఫేస్బుక్ తాజాగా మరోసారి మరో వివాదంలో చిక్కుకుంది.

ఫేస్బుక్లో ఉన్న లోపం కారణంగా దాదాపు 68 లక్షల మంది యూజర్ల ఫొటోలు ఓ థర్డ్పార్టీ అప్లికేషన్ ద్వారా బయటకి వెల్లడయ్యాయట .దాదాపు 12 రోజుల పాటు ఈ బగ్ యాక్టివ్లో ఉందని, ప్రస్తుతం దాన్ని సరిచేసినట్లు ఫేస్బుక్ వెల్లడించింది.ఇందుకు గానూ యూజర్లకు క్షమాపణలు కూడా చెప్పేసింది.ఫేస్బుక్ లాగిన్తో థర్డ్ పార్టీ యాప్లకు యూజర్లు ఫొటో యాక్సెస్ అనుమతి ఇస్తుంటారు.అయితే ఇందులో ఏర్పడిన బగ్ కారణంగా యూజర్లు పోస్టు చేయని ఫొటోలు కూడా యాప్ల ద్వారా పోస్ట్ అయినట్టు ఫేస్బుక్ తెలిపింది.‘సాధారణంగా ఫేస్బుక్ ఫొటోలను యాక్సెస్ చేసుకునేందుకు యూజర్లు యాప్లకు అనుమతి ఇచ్చినప్పుడు కేవలం యూజర్లు టైమ్లైన్లో షేర్ చేసిన ఫొటోలను మాత్రమే యాక్సెస్ చేసుకునేందుకు మాత్రమే మేం వీలు కల్పిస్తాం.అయితే ఫేస్బుక్లో తలెత్తిన బగ్ కారణంగా మార్కెట్ప్లేస్ లేదా ఫేస్బుక్ స్టోరీస్లో షేర్ చేసిన ఫొటోలను కూడా యాప్లు యాక్సెస్ చేసుకోగలిగాయి’ అని సంస్థ ఇంజినీరింగ్ డైరెక్టర్ తోమర్ బార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.

యూజర్లు ఫేస్బుక్లో అప్లోడ్ చేసి పోస్టు చేయని ఫొటోలు కూడా ఈ బగ్ కారణంగా బహిర్గతమైనట్లు తోమర్ బార్ తెలిపారు.సెప్టెంబరు 13 నుంచి 25 వరకు ఈ బగ్ యాక్టివ్లో ఉందని, ఆ సమయంలో దాదాపు 68లక్షల మంది యూజర్ల పోస్టు చేయని ఫొటోలు బహిర్గతమైనట్లు బార్ పేర్కొన్నారు.ఈ విషయమై ఇప్పటికే సదరు యూజర్లకు నోటిఫికేషన్ పంపించినట్లు తెలిపారు.
ఘటనపై యూజర్లకు ఫేస్బుక్ క్షమాపణ చెబుతున్నట్లు బార్ చెప్పారు.బగ్ ప్రభావిత యూజర్ల ఫొటోలను ఫేస్బుక్ నుంచి డిలీట్ చేసే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.