నవంబర్ 23న కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్ధి మరణించిన సంగతి తెలిసిందే.దీనికి సంబంధించి 60 ఏళ్ల డ్రైవర్ను టొరంటో పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలోని మిడ్టౌన్ యోంగే స్ట్రీట్ సెయింట్ క్లెయిర్ అవెన్యూ కూడలి వద్ద అతని సైకిల్ను పికప్ ట్రక్ ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో 20 ఏళ్ల కార్తీక్ సైనీ ప్రాణాలు కోల్పోయాడు.అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సంకేతాలను ఉల్లంఘించినందుకు డ్రైవర్పై గురువారం అభియోగాలు మోపారు.
ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 16, 2023న డ్రైవర్ కోర్టులో విచారణకు హాజరవుతాడు.
సైనీ షెరిడాన్ కాలేజీలో చదువుకుంటున్నాడు.
ప్రమాదం జరగిన తర్వాత తీవ్ర గాయాలతో వున్న కార్తీక్ను కాపాడేందుకు పారామెడిక్స్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.ఇతను 2021లో కెనడాకు వచ్చినట్లుగా సీబీసీ టొరంటో తెలిపింది.
ట్రాఫిక్ సర్వీస్కి చెందిన సిబ్బంది ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరిన్ని ఆధారాలను రాబట్టేందుకు పరిశీలిస్తున్నారు.
మరోవైపు సైనీ మరణవార్త గురించి తెలుసుకున్న హర్యానాలోని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.అతని మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి రప్పించాలని భారత్, కెనడా ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తున్నారు.కార్తీక్ హఠాన్మరణంతో తమ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందని, అతని భౌతికకాయాన్ని త్వరగా భారతదేశానికి తరలించేందుకు తమకు సహాయం చేయాలని సైనీ బంధువు రవి అంటారియో ప్రీమియర్ డగ్ను ఉద్దేశించి శనివారం ట్వీట్ చేశారు.ఇదిలావుండగా .కార్తీక్ సైనీకి నివాళిగా అడ్వకేసీ ఫర్ రెస్పెక్ట్ ఫర్ సైక్లిస్ట్లు, టోరంటోకి చెందిన వాలంటీర్ గ్రూప్ నవంబర్ 30న రైడ్ ఏర్పాటు చేసింది.