ఏపీ సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచిస్తున్నారు.ఈ మేరకు 175 సీట్లను గెలవాలని వైసీపీ నేతలకు పదే పదే చెప్తున్నారు.ఎమ్మెల్యేలతో ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించినా ఇదే మాటను మాట్లాడుతున్నారు.175 సీట్లు గెలవడమంటే మాములు విషయం కాదు.ఆశ పడాలి కానీ అత్యాశ పడకూడదని పెద్దలు చెప్తుంటారు.కానీ జగన్ మాటలు వింటే అత్యాశ అని అనిపించకమానదు.అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న జగన్ ఓ ఐదుగురు నేతలను టార్గెట్ చేశారు.
ఈ జాబితాలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గద్దె రామ్మోహన్తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది.
వీరిలో పవన్ కళ్యాణ్ను గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడించింది.ఆయన జనసేన అధినేత కావడంతో మరోసారి ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది.
పవన్ పోటీ చేసే నియోజకవర్గం ఇంకా ఖరారు కానప్పటికీ ఎక్కడి నుంచి బరిలోకి దిగితే అక్కడి నుంచి ఆయన్ను ఓటమి పాలు చేయాలనే పట్టుదలను జగన్ ప్రదర్శిస్తున్నారు.
అటు కుప్పం నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించిన చంద్రబాబును ఓడించడానికి ఇప్పటి నుంచే వైసీపీ మైండ్ గేమ్ ప్రారంభించింది.

చంద్రబాబును ఓడిస్తే టీడీపీని నైతికంగా దెబ్బతీయవచ్చని వ్యూహాలు రచిస్తోంది.ఈ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి జగన్ అప్పగించారు.అంతేకాకుండా టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు గెలిచిన అచ్చెన్నాయుడిపైనా వైసీపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది.అచ్చెన్నాయుడు ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తుండటంతో ఆయన్ను ఓడించి టీడీపీ నేతల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే అచ్చెన్నాయుడిని ఓ స్కాంలో ఇరికించి జగన్ అరెస్ట్ చేయించారు.

ఇటీవల టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు కూడా ప్రభుత్వాన్ని చికాకు పరుస్తున్నాయి.ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారన్న విషయంపై క్లారిటీ లేకపోయినా వైసీపీ ఆయన్ను ఓడించేలా వ్యూహాలు రచిస్తోంది.అంతేకాకుండా విజయవాడ తూర్పు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దె రామ్మోహన్ ను ఓడించడం ద్వారా రాజధాని అమరావతి ప్రాంతంలో తమకే పట్టుందని నిరూపించుకోవడానికి అవకాశంగా అధికార పార్టీ వైసీపీ భావిస్తోంది.