సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని తుమ్మగూడెం గ్రామంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోని చెట్లను ఎవరికీ తెలియకుండా నరికేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే తుమ్మగూడెం గ్రామానికి చెందిన ఉబ్బపల్లి వెంకన్న తన తాతల కాలం నుండి వస్తున్న 5 గుంటల ప్రభుత్వ భూమిలో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు.
అయితే గత ప్రభుత్వ హయాంలో గ్రామ సర్పంచ్ వెంకన్నను బెదిరించి,ఆ భూమిని లాక్కొని అందులో పల్లె ప్రకృతి వనం పెట్టించాడు.
ఇదేంటని అడిగితే రూ.20 వేలు ఇప్పించి,అది రెవిన్యూ శాఖ కింద ఉన్నదని భూమిలో నుండి వెళ్లిపోవాలని హుకూం జారీ చేశాడు.గత ప్రభుత్వంలో ఏమీ చేయలేక ఊరుకున్న రైతు వెంకన్న రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన భూమి తనకు కావాలని పల్లె ప్రకృతి వనంలో ఏపుగా పెరిగిన చెట్లను నరికేసినట్లు తెలుస్తుంది.
ఈ విషయమై గ్రామ పంచాయితీ సెక్రటరీ కూడా మౌనంగా ఉండడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఈ ఘటనపై అధికారులు స్పందించి,విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.