వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్ ( CM Jagan )రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఎన్నికల సమర శంఖం పూరించారు.నిన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కీలక నాయకులు విజయవాడలో భారీగా సమావేశాన్ని ఏర్పాటు చేసి అనేక అంశాలపై జగన్ ప్రసంగించారు.
రాబోయే ఆరు నెలలు ఎంతో కీలకమని, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు ఇళ్లకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలని సూచించారు. మార్చి లేదా ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని , ఎవరూ అలసత్వం వహించవద్దని , ప్రభుత్వానికి అనుకూలంగా నివేదికలు ఉన్నాయని, వై నాట్ 175 అన్న నినాదంతోనే నేతలంతా పనిచేయాలని జగన్ సూచించారు.
ఈ మేరకు 175 నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై జగన్ క్లారిటీ ఇచ్చారు. 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్రలు , జగనన్న సురక్ష, వై ఏపీ నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్ర పేరుతో వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

వైసిపి ( YCP )ప్రజాప్రతినిధులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీని ప్రజలకు దగ్గర చేయాలని సూచించారు.జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా వైసీపీ నేతలు అంతా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల ఆరోగ్యం గురించి తెలుసుకోవడంతోపాటు, పార్టీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవాలని , ప్రజల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ద్వారా, ఆయా నియోజకవర్గాల్లో నేతలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే విధంగా ప్లాన్ చేశారు.జగనన్న సురక్ష కార్యక్రమం ముగిసిన తర్వాత బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు చేరువయ్యేందుకు వైసిపి ప్లాన్ చేస్తుంది .టిడిపి , జనసేన( Jana sena ) పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వస్తూ ఉండడంతో , ఆ రెండు పార్టీలను దీటుగా ఎదుర్కొనేందుకు జగన్ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు .

గ్రామస్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు అంతా జనంలోనే ఉంటూ, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు , వాటి వల్ల జనాలకు చేకూరుతున్న లబ్ధి వంటివన్నీ వాటిని వివరిస్తూ, అధికారంలోకి వస్తే ఏ స్థాయిలో జనాలకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని చాటి చెప్పే విధంగా పార్టీ తరపున అనేక కార్యక్రమాలను రూపొందించారు .పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి పార్టీ శ్రేణులను తీసుకువెళ్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారు దీంతో వరుస వరుసగా పార్టీ కార్యక్రమాలతో వైసిపి నాయకులు అంతా బిజీ బిజీగా మారనున్నారు.







