ఏపీలో వైసీపీ ప్రభుత్వ పరిపాలన పై ఎప్పుడూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెరిగే విధంగా చేస్తూ ఉంటారు టిడిపి అధినేత చంద్రబాబు.ప్రతి విషయం పైన ఆయన స్పందిస్తూ ప్రజల్లో నిత్యం తిరిగేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వం పై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని బలంగా నమ్ముతున్న బాబు ‘బాదుడే బాదుడు ‘ పేరుతో వినూత్నంగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటూ జిల్లాల వారీగా పర్యటనలు చేస్తున్నారు.ఈ సందర్భంగా వైసిపి, ఆ పార్టీ అధినేత జగన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రధాన కారణమైన ‘నవరత్నాలు ‘ కార్యక్రమాలపై ఎక్కువ ఫోకస్ పెంచారు.నవరత్నాలు పేరుతో ప్రజలను నిలువునా మోసం చేశారని, ప్రభుత్వం తీరు ఇదే విధంగా ఉంటే భావితరాలు కోరుకోలేవు అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు.
టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుని కేసులు పెట్టి జైలుకు పంపారని బాబు ఫైర్ అయ్యారు.
వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కి ఉరి వేయాల్సిన బాధ్యత మీ పైనే ఉందని ప్రజలకు సూచించారు.
వైఎస్ వివేకానంద రెడ్డి ని హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ మూడేళ్ల పాలనలో ఇళ్లు కూడా కట్టలేదని, రెండేళ్లలో 30 వేల ఇళ్లు ఎలా కడతారు అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.
ఎన్నికలకు ముందు నవరత్నాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెంచి జేబులకు నవరంధ్రాలు పెట్టారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీలో అరాచక పాలన సాగుతోందని, స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని, వైసిపి మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, మూడేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం వచ్చే రెండేళ్ళలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తుంది అని విమర్శించారు.శ్రీలంకలో రాజపక్స ప్రభుత్వానికి, ఏపీలో వైసీపీ పాలనకు ఏమాత్రం తేడా లేదని బాబు విమర్శలు చేశారు.