నల్గొండ జిల్లా: తెలంగాణలో ఎన్నికలతో సతమతమవుతున్న సమయంలో నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదల వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసింది.అటు ఆంధ్రా పోలీసులు,ఇటు తెలంగాణ పోలీసులు ఇరువైపులా పెద్దఎత్తున మోహరించడంతో రెండు రోజులుగా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.
దీంతో చివరకు కృష్ణా రివర్ బోర్డు కూడా రంగంలో దిగి వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఆదేశించింది.అటు కేంద్రం కూడా వివాదంపై స్పందించి ఇరు రాష్ట్రాలను చర్చలకు పిలిచింది.
సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో ప్రాజెక్టులు ఉంచటంతో పాటు కృష్ణా బోర్డు ఆదేశాల ఖచ్చితంగా అమలు జరిగేలా చూస్తామని ప్రకటించింది.ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ కల్పించుకుని పలు ప్రతిపాదనలు చేసింది.
ఈ ప్రతిపాదనలకు ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు అంగీకరించాయి.డ్యామ్ నిర్వహణను కృష్ణా వాటర్ బోర్డు మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.
కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు నాగర్జున సాగర్ చేరుకున్న సీఆర్పీఎఫ్ బలగాలు పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాయి.నేరుగా ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా రైట్ కెనాల్ సమీపంలో ఉన్న రెడ్ బ్యాంక్ ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు.
సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు ప్రాజెక్ట్పై ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఇప్పటికే డ్యాంపై ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులను పంపించే పనిలో కేంద్ర బలగాలు ఉన్నాయి.
అయినా కుడి కాలువకు నీటి విడుదల ఇంకా కొనసాగుతోంది