నల్లగొండ జిల్లా: బీఆర్ఎస్ ప్రభుత్వంతో డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రాణహాని ఉందని, ఆయనకు ఏమైనా జరిగితే రాష్టం అగ్నిగుండం అవుతుందని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి ప్రియదర్శిని మేడి హెచ్చరించారు.
శనివారం నకిరేకల్ పట్టణ కేంద్రంలో కాంపిటీషన్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు సంఘీభావంగా బీఎస్పీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిఎస్పిఎస్సీ పేపర్ లీకేజ్ అంశంపైన ఎవ్వరు మాట్లాడినా వారిని అణచివేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆమరణ దీక్ష చేపడితే దాన్ని భగ్నం చేసి ఆయన ను అరెస్టు చేయడాన్ని యావత్తు తెలంగాణ సమాజం చూసిందని అన్నారు.డా.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు.
టిఎస్పిఎస్సిలో గ్రూప్1 ఏఈ,టిపిఓ,వెటర్నరీ సర్జన్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలన్నారు.
తెలంగాణ కోసం కొట్లాడిన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని, హడావుడిగా వేలాది ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి, ఒకవైపు కోర్టుల్లో కేసులు, మరోవైపు పేపర్ లీకేజీలతో పేద నిరుద్యోగ అభ్యర్థులను మోసం చేస్తున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు .టిఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు జరిగే వరకు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొవ్వూరి రంజిత్,నియోజకవర్గ ఇంచార్జి గద్దపాటి రమేష్, నియోజకవర్గ మహిళా కన్వీనర్ మర్రి శోభ,కడారి మల్లేష్,వెంకటేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.