ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు మాదిరిగానే బిజెపి సైతం 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది.ప్రజా పోరాటాలు, పాదయాత్రలు, ఆందోళన కార్యక్రమాల ద్వారా టిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఏ విధంగా అయితే బలపడిందో, అంతే స్థాయిలో ఏపీ బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులతో పాటు, బిజెపి అగ్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
అందుకే పూర్తిగా ఏపీపై దృష్టి పెట్టారు.వివిధ ప్రజా పోరాటాలు, ఆందోళన కార్యక్రమాల ద్వారా జనాల్లో బలం పెంచుకోవడంతో పాటు, బిజెపి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా అన్ని రకాలుగా కసరత్తులు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే భారీ యాక్షన్ ప్లాన్ కు ఏపీ బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మేరకు విజయవాడలో జరిగిన బిజెపి పదాధికారులు , జిల్లా అధ్యక్షుల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు .ఇటీవల బీజేపీ చేపట్టిన జలం కోసం జనయాత్రకు విశేష స్పందన రావడంతో , అంతే స్థాయిలో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.ఈ మేరకు బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ విషయాన్ని ప్రకటించారు.రాయలసీమ ప్రాంతంలోని పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలనే ప్రధాన డిమాండ్ తో యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ యాత్రకు బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షత వహిస్తారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా బిజెపిని బలోపేతం చేయడమే లక్ష్యంగా 175 నియోజకవర్గాల్లోనూ 5000 సభలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
సెప్టెంబర్ 25వ తేదీన దీన్ దయాళ్ జయంతిని నిర్వహించబోతున్నారు.ప్రజా వ్యతిరేక విధానాలపై బిజెపి అక్టోబర్ 5వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. అలాగే ప్రతి నియోజకవర్గంలోనూ బిజెపి సొంతంగా బలపడేందుకు రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించే విధంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజా పోరాట యాత్రలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ యాత్రలు చేపట్టి బిజెపి గ్రాఫ్ పెంచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుందనేది పక్కన పెట్టి , పూర్తిగా బిజెపి బలం పెంచుకునే దిశగా యాత్రలకు ఏపీ బీజేపీ నాయకులు శ్రీకారం చుట్టారు.దీనికి కేంద్ర బిజెపి పెద్దల నుంచి తగిన సలహాలు , సూచనలు ఎప్పటికప్పుడు వస్తుండడం తో ఏపీ బీజేపీ నాయకులు దూకుడు పెంచారు.