తెలంగాణలో అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న కేంద్ర అధికార పార్టీ బిజెపి దానికి తగ్గట్లు గానే వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజల్లో చులకన భావన ఏర్పడే విధంగా, రాబోయే ఎన్నికల్లో బిజెపికి ( BJP )ఆదరణ పెరిగే విధంగా సరికొత్త ప్లాన్ ను సిద్ధం చేసుకుంటుంది.
దీనిలో భాగంగానే బీఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి కౌంటర్లు ఇచ్చే విధంగా సిద్ధమవుతోంది.తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాలను భారీగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో, నిరసనలతో షాక్ ఇచ్చే విధంగా బిజెపి ప్లాన్ లు సిద్ధం చేస్తుంది.
వివిధ రంగాల వారీగా బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను వినూత్న రీతిలో జనాలకు అర్థమయ్యే విధంగా బిజెపి ప్లాన్ చేస్తుంది.
ఈరోజు నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది.దీనిలో భాగంగా సీనియర్ నాయకులు అందరిని ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నారు.ఈరోజు రైతు దినోత్సవంను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్ గా కెసిఆర్ పాలనలో వ్యవసాయ రంగం ఏ విధంగా దెబ్బతింది, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటుంది.
రాష్ట్ర జిల్లా స్థాయిలో ఈరోజు మీడియా సమావేశంలు నిర్వహిస్తూనే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలపాలని తెలంగాణ బిజెపి నిర్ణయించుకుంది.దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి( Bandi Sanjay ) రూపొందించారు.
జూన్ 4వ తేదీన పోలీస్ వ్యవస్థను కేసీఆర్ కుటుంబం సొంత ప్రయోజనాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటుందనే అంశంతో పాటు, పోలీసులు పడుతున్న ఇబ్బందులను ప్రజలకు తెలియజేసే విధంగా ప్లాన్ చేస్తోంది .
జూన్ 5న విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై పడుతున్న భారం, కేసీఆర్ ( CM KCR )పాలనలో విద్యుత్ సంస్థలు ఏ విధంగా దివాలా తీసాయి అనే అంశాల పైన నిరసన చేపట్టనున్నారు.పారిశ్రామిక రంగం సంక్షోభం పై జూన్ 6న సాగునీటి ప్రాజెక్టుల దోపిడీపై 7 న చెరువుల కబ్జాపై, 8న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం కేసీఆర్ పాలనలో సంక్షోభంలో పడింది అనే అంశంపై 9 న కేసీఆర్ దుష్పరిపాలనలో జరిగిన అవినీతిపై , 10న దశాబ్ది తెలంగాణలో కవులు, కళాకారులకు జరుగుతున్న అన్యాయంపై, 11న నిరసనలు తెలపనున్నారు.ఇదేవిధంగా జూన్ 22 వరకు అనే కార్యక్రమాలను తెలంగాణ బిజెపి నిర్వహించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.