కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.ఆయన దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం నిలిపివేసింది.2019 లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ కు చెందిన పూర్ణేశ్ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో కూడా ఉపశమనం లభించకపోవడంతో సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించారు.దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రాహుల్ గాంధీ దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈ సందర్భంగానే రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు చురకలు అంటించింది.బాధ్యతాయుతమైన హోదాలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాలని తెలిపింది.ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవన్న ధర్మాసనం ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని సూచించింది.రాహుల్ గాంధీ జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సిందని వెల్లడించింది.







