విజయవాడ వాసుల దశాబ్దాల స్వప్నం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్.ఇటీవల ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ , ప్రారంభానికి మాత్రం నోచుకోలేదు.
పలుమార్లు ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసినప్పటికీ , గత కొద్ది రోజులుగా ఏవో కారణాలతో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం వాయిదా పడుతూ వస్తుంది.అయితే, అన్ని అవరోధాలను దాటుకొని , విజయవాడ వాసుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ఈ ఫ్లై ఓవర్ నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయింది.
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు వర్చువల్ కార్యక్రమం ద్వారా కనకదుర్గ ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమం తర్వాత రూ.7584 కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు.మొత్తం రూ.15,592 కోట్ల రూపాయల పనులకు భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేశారు.ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, సీఎం వైఎస్ జగన్ లు జాతికి అంకితం ఇచ్చారు.కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది.900 పని దినాలలో ఫ్లై ఓవర్ పూర్తి చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఢిల్లీలోని నితిన్ గడ్కరీ ఆఫీసు నుంచి, ఇటు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.గతంలో ఈ ప్రారంభోత్సవం నాలుగుసార్లు వాయిదా పడింది.
ఈ క్రమంలో వర్చువల్ గా ప్రారంభించాలని గడ్కరీ, జగన్ నిర్ణయం తీసుకున్నారు.కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ రాష్ట్రంలోనే అతి పెద్ద నది పరివాహక ప్రాంత వంతెన కానుంది.
.






