నల్లగొండ జిల్లా :కుల రహిత సమాజం కోసం జీవితాంతం కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేత,కేవలం దళితుల కోసమే కాదు అన్ని వర్గాల వారి అభ్యున్నతి గురించి ఆలోచించిన మహనీయుడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, దేశంలో వ్యవసాయ రంగం ఇంత పురోగతి సాధించిందంటే అది జగ్జీవన్ రామ్ ముందుచూపు వల్లేనని గుర్తు చేశారు.తాను నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ విగ్రహం ఏర్పాటైందని,ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఆనాడు లోక్ సభ స్పీకర్ గా ఉన్న ఆయన కుమార్తె మీరా కుమారిని తీసుకొచ్చి జగ్జీవన్ రామ్, డా.బీఆర్.అంబేద్కర్, విగ్రహాలను ప్రారంభించడం జరిగిందన్నారు.ఈ ఇద్దరి మహనీయుల విగ్రహాలు పక్కపక్కనే ఎక్కడా లేవని, మన నల్గొండలోనే ఏర్పాటు చేశామని తెలిపారు.జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు,నాయకులు నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు.