కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి.నిర్మాణం, రిటైల్, రవాణా, వాణిజ్యం, టూరిజం ఇలా అన్నిటి పరిస్ధితి దారుణంగా వుంది.
వాటితో పాటు అత్యంత కీలకమైన విద్యా రంగం కూడా ఈ పెను సంక్షోభం ధాటికి విలవిలలాడుతోంది.ఇప్పటికే అన్ని దేశాల్లోనూ కీలక పరీక్షలు వాయిదాపడగా, ఈ ఏడాదైనా అడ్మిషన్లు వుంటాయా లేదా అన్న ప్రశ్నలు ఎంతోమందిని వేధిస్తున్నాయి.
ఆర్ధిక వ్యవస్థలో విద్యా రంగం కూడా భాగమే.ఇక్కడ చదువు ఒక్కటే ప్రామాణికంగా తీసుకోకూడదు.
దీనిని ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న కొన్ని ఇతర రంగాలు కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి.ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో అన్ని దేశాలు మరోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ క్రమంలో అమెరికాలోని బోస్టన్, చికాగోలలో వందలాది మంది విద్యార్ధులు రిమోట్ లెర్నింగ్ కోరుతూ ఆందోళనకు దిగారు.ప్రస్తుతం అమెరికాలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అగ్రరాజ్యంలోని పాఠశాలలకు అంతరాయం కలుగుతోంది.
బోస్టన్లోని 11 పాఠశాలల నుంచి దాదాపు 600 మంది విద్యార్ధులు ఆందోళనల్లో పాల్గొన్నట్లు స్కూల్ డిస్ట్రిక్ట్ తెలిపింది.రిమోట్ లెర్నింగ్ కోరుతూ ‘‘కోవిడ్ 19 బ్రీడింగ్ గ్రౌండ్’’ అంటూ బోస్టన్ స్కూల్ సీనియర్లు ప్రారంభించిన ఆన్లైన్ పిటిషన్లో శుక్రవారం ఉదయం నాటికి 8000 మందికి పైగా సంతకాలు చేశారు.
వాకౌట్కు పిలుపునిచ్చిన బోస్టన్ స్టూడెంట్ అడ్వైజరీ కౌన్సిల్, రెండు వారాల రిమోట్ లెర్నింగ్తో పాటు ఉపాధ్యాయులు , విద్యార్ధులకు మెరుగైన కోవిడ్ 19 పరీక్షలతో అనేక డిమాండ్లను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

కోవిడ్ 19 ప్రస్తుత వేవ్ నేపథ్యంలో పాఠశాలలను తెరిచి వుంచాలా వద్దా అనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి.కోవిడ్ ప్రోటోకాల్లపై ఉపాధ్యాయులు, పాఠశాల జిల్లాల మధ్య ప్రతిష్టంభన కారణంగా విద్యార్ధులు తరగతులు రద్దయిన వారం తర్వాత చికాగో పాఠశాలలకు తిరిగి వచ్చారు.ఈ వారం ప్రారంభంలో న్యూయార్క్ నగరంలోని పాఠశాలల్లో విద్యార్ధులు భద్రతా చర్యలు సరిపోవడం లేదని నిరసిస్తూ తరగతులు వాకౌట్ చేశారు.
నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ గురువారం మాట్లాడుతూ… విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.కోవిడ్, ఒమిక్రాన్ కారణంగా దేశవ్యాప్తంగా ఒక్క వారంలోనే 5000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడినట్లు బర్బియో తెలిపింది.
అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం.గడిచిన వారంలో దేశంలోని ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తొలి ప్రాంతాల్లో వైరస్ తగ్గుముఖం పట్టినట్లుగా కనిపిస్తోంది.
అయితే ఈశాన్య, దక్షిణ రాష్ట్రాల్లో మాత్రం కొత్త కేసులు 5 శాతం పెరిగాయి.