నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ సార్ అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.జయశంకర్ సార్ 12వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు ప్రజా సంఘాల అధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ ఆకాంక్షించిన ఉద్యమ ఆకాంక్షలను,ఉద్యమ విలువలను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందన్నారు.ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని అక్రమ కేసులు బనాయించి వాక్ స్వాతంత్రాన్ని హరించి వేస్తున్నారని,ఇది జయశంకర్ సార్ ఆశించిన తెలంగాణ కాదన్నారు.ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు యధేచ్చగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల దోపిడీ చేస్తున్నా,కేంద్ర ప్రభుత్వం తేల్చకుండా తాత్సారం చేస్తున్నా,కేసీఆర్ మాత్రం మౌనంగా ఉంటున్నారని,
జయశంకర్ సార్ అన్యాయాల పట్ల,దోపిడీ పట్ల ఏనాడు మౌనంగా లేడని వారన్నారు.9 ఏండ్ల కాలంలో ఒక్క టీఎంసీ వాటర్ ని కూడా అదనంగా సాధించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ నిధులలో ప్రతి పౌరునికి వాటా దక్కాలని జయశంకర్ సార్ ఆకాంక్షించారని,కానీ, నిధులన్నీ సీమాంధ్ర కాంట్రాక్టర్ల కేంద్రంగా కేంద్రీకృతమై ఉన్నవని,ఈ కార్పొరేట్ శక్తుల ద్వారా వాటాలను పొందుతూ తెలంగాణను ఆరు లక్షల కోట్ల అప్పుల పాలు చేశారన్నారని ఆరోపించారు.నియామకాల విషయంలో అరకొరా పోలీసు ఉద్యోగాలు వేసి ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ నిర్బంధకాండ ను ప్రయోగిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక క్యాలెండర్ ఉంటదని జయశంకర్ సార్ ఆరోజు అన్నాడని గుర్తు చేశారు.
కానీ,తెలంగాణ ప్రభుత్వంలో నియామకాల విషయంలో ఒక స్పష్టత లేదని,వేసిన కొన్ని నోటిఫికేషన్లు,నిర్వహించిన పరీక్షల విధానం మొత్తం లీకేజీల చుట్టే తిరుగుతుందన్నారు.సంపూర్ణంగా ఈ తొమ్మిది ఏళ్ల కాలంలో జయశంకర్ శార్ ఆకాంక్షలకు వ్యతిరేకంగా మొత్తం పెడదోవబట్టి నియంతృత్వానికి కేంద్రంగా నిలిచిందన్నారు.
జయశంకర్ సార్ ఆలోచన విధానం మార్గంలో మరొక ప్రజాస్వామిక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందన్నారు.విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సీనియర్ నాయకులు బకరం శ్రీనివాస్ మాట్లాడుతూ కేసీఆర్ పాలన మొత్తం అస్తవ్యస్తంగా ఉందన్నారు.
దళిత బహుజన వర్గాల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు.పాలనా మొత్తం ఫామ్ హౌస్ కేంద్రంగా కేంద్రీకృతమై ఉందన్నారు.
ప్రజల వద్దకు పోవాలిసిన పాలకులు అధికారానికి దాసోహమైనారన్నారు.
పాలన విధివిధానాలలో పారదర్శకతగాని జవాబుదారితనంగాని లేదన్నారు.
జయశంకర్ సార్ ఆలోచనలకు స్వయంపాలకుల ఆచరణకు పొంతన లేదన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షమయ్య, విద్యావంతుల వేదిక గౌరవ అధ్యక్షులు ఆర్.విజయ్ కుమార్,కాశయ్య,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,బొజ్జ దేవయ్య,కారింగు నరేష్ గౌడ్,కొంపెల్లి రామన్న గౌడ్,వెంకన్న,హరికృష్ణ,బీపంగి యాదయ్య,బొజ్జ లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.