సూర్యాపేట జిల్లా:దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 14 న భారత రాజ్యాంగ నిర్మాత,భారతరత్న,ప్రపంచ జ్ఞాని,సామాజిక,ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక తత్వవేత్త డా.బీఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు జరుపుకుంటున్న అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉపాధి హామీ కూలీల వద్ద మధ్యన జరుపుకోడం సంతోషంగా ఉందని సీనియర్ జర్నలిస్ట్ గంట సోమన్న అన్నారు.
శుక్రవారం మునగాల మండల రేపాల గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న వ్యవసాయ భూముల్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యాతిధిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో కుల వ్యవస్థ ద్వారా మనుషుల మధ్య అంతరాలు సృష్టించి,వేల సంవత్సరాల నుండి దేశంలోని ఎస్సి,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలను తీవ్రమైన అవమానాలకు, అనివేచివేతలకు గురి చేసిన మను ధర్మాన్ని తగుల బెట్టి,మనుషులంతా సమాన హక్కులతో జీవించే విధంగా ప్రప్రంచలొనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డా.బీఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఈ దేశ ప్రజల కోసం తన కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తి బాబాసాహెబ్ అని గుర్తు చేశారు.
ఆయన మన కోసం చేసిన త్యాగమే నేటి సమాజ మనుగడకు దిక్సూచిగా నిలిచిందని అన్నారు.దేశంలోని ప్రతీ ఒక్కరి కోసం ఆయన ఆయన తన జీవితాన్ని ఫణంగా పెట్టి ఎన్నో సామాజిక పోరాటాలు నిర్వహించి మనకు హక్కులు సాధించి పెడితే ఆయనను ఇంకా అనేకమంది అర్థం చేసుకోవడంలో వెనుకబడి ఉండటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
అంబేద్కర్ అందరి వాడుగా మారితే ఈ దేశంలో కొన్ని ఆధిపత్య కులాల మనుగడ ప్రశ్నకార్థంగా మారుతుందనే భయంతో కొందరి వాడుగా చిత్రీకరించే కుట్ర జరుగుతోందని,వారు చేసే కుట్రలో బహుజనులు పడొద్దని హెచ్చరించారు.ఈ రోజు ఉపాధి హామీ చట్టం అమలు జరుగుతుందంటే అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ఫలితమేమని, అందుకే ప్రతీ ఒక్కరూ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలని సూచించారు.
విహెచ్ పీఎస్ నియోజకవర్గ అధ్యక్షుడు పేరెల్లి బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ చీమ ఆంజనేయులు,చిట్యాల రమణారెడ్డి,బీసీ సంఘం నాయకులు బెజవాడ మధు,వార్డు మెంబర్స్ సోమపంగు అక్కమ్మ,మేరుగు హరిప్రియముత్తయ్య, యూత్ నాయకులు సోమపంగు పాపారావు, సోమపంగు వెంకన్న,ఎర్ర ప్రసాద్,సోమపంగు బాలకృష్ణ,ఎర్ర వెంకటేశ్వర్లు,ఎర్ర వెంకన్న ఉపాధి హామీ మేట్లు,మహిళా కూలీలు తదితరులు పాల్గొన్నారు.