సూర్యాపేట జిల్లా:పిసి,ఎస్ఐ ఉద్యోగ నియామకాల సందర్భంగా జిల్లా యంత్రాంగం,జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకున్న నిరుద్యోగ యువతి, యువకులు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్వహించిన పిసి,ఎస్ఐ ప్రాథమిక పరీక్షలు వ్రాశారు.ప్రాథమిక పరీక్షలకు సంబంధించిన పోలీసు నియామక బోర్డు విడుదల చేసిన ప్రాథమిక కీ నందు ఉత్తీర్ణత పొందనున్న యువతి యువకులు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు యువతీ యువకులు మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన తాము ఉద్యోగాలకు సిద్ధమయ్యే విషయంలో ఆందోళన చెందామని,శిక్షణ ఎక్కడ తీసుకోవాలి,ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎలా ఎదుర్కోవాలని ఇబ్బంది పడుతున్న సమయంలో జిల్లా యంత్రాంగం,పోలీసు శాఖ అధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం,భోజనం వసతి కల్పించడం,తమకు ఎంతగానో ఉపయోగపడిందని అధికారులకు,పోలీసు శాఖకు రుణపడి ఉంటామని అన్నారు.ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి ఉద్యోగం సాధించి శిక్షణకు పేరు తెస్తామని ఎస్పీకి తెలిపారు.
శిక్షణలో నేర్పిన మెడిటేషన్ తరగతులు తమ ఏకాగ్రతకు ఎంతగానో దోహదపడిందన్నారు.అనంతరం ఎస్పీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కష్టపడితే సాధించలేనిది అంటూ ఏదీ ఉండదని అభ్యర్థులకు వివరించారు.
మీ ప్రయత్నానికి సహకారంగా ప్రభుత్వం,మంత్రి సహకారంతో తాము శిక్షణ అందించామని,ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని అన్నారు.యువత ఇబ్బందులు పడొద్దని 60 రోజుల శిక్షణను పొడిగించి ప్రాథమిక అర్హత పరీక్ష తేదీ వరకు 105 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇచ్చామని, ప్రయత్నం అనేది రాజీలేని దోరణిలో సాగాలన్నారు.
ఉత్తీర్ణత సాధించి ముందుకు వెళ్లాలి ప్రతిఒక్కరూ ఉద్యోగం పొందాలని ఆశిస్తున్నానని అన్నారు.ప్రభుత్వం,డీజీపీ ఆదేశాల మేరకు మంత్రి సహకారంతో 250 మంది అభ్యర్థులకు 105 రోజుల పాటు ఈ శిక్షణ ఇచ్చామని అన్నారు.
ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి,శిక్షణ కోసం ప్రత్యేక శ్రద్ద వహించిన మంత్రికి మీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు.శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగం సాధించాలని అన్నారు.
ఈ సమావేశంలో నందు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్,సోమ్ నారాయణ సింగ్,ఆర్ఐలు నర్సింహారావు,శ్రీనివాసరావు,గోవిందరావు,శ్రీనివాస్, ఆర్ఎస్ఐ సాయి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.