కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉమ్మడి రాష్ర్ట విభజన తరువాత మొదటిసారిగా ఏపీలోని రాయలసీలకు రాబోతున్నారు.విభజన తరువాత ఆయన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి తెలుసు.
అక్కడ పాదయాత్ర కూడా చేశారు.ఇదేమాదిరి పర్యటనను ఏపీలోనూ డిజైన్ చేశారు కాంగ్రెసు నాయకులు.
రాహుల్ జూలై ఇరవై నాలుగో తేదీన ఒక్క రోజు పర్యటన కోసం అనంతపురం జిల్లాకు వస్తున్నారు.ఆయన పది కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసి గ్రామీణులను కలుసుకొని మాట్లాడతారు.
ప్రధానంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులతో, స్వయం సహాయక గ్రూపుల వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు.ఈ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్మికులకు పనులు దొరకడంలేదనే వార్తలు వస్తున్నాయి.
రాహుల్ ఆంధ్రలో కాంగ్రెసు నాయకత్వానికి మరమ్మతులు చేస్తారని కూడా భావిస్తున్నారు.రాష్ర్ట విభజన తరువాత అక్కడ కాంగ్రెసు నామరూపాలు లేకుండా పోయిన సంగతి తెలిసిందే.
అయితే ఆయన ఒక్కరోజు పర్యటనతో ఏం చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.ఈమధ్యే ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీలోకి పోయారు.
ప్రస్తుత ఏపీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి నాయకత్వంపై కూడా పార్టీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.వచ్చే ఎన్నికల నాటికైనా ఏపీలో పార్టీ బలపడాలి.
అలా కావాలంటే ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి.అందుకు రాహుల్ గాంధీ శ్రీకారం చుడుతున్నారేమో….! గతంలో ఆయన తెలంగాణలో పర్యటించారుగాని ఏమీ ప్రయోజనం కనిపించలేదు.హైదరాబాదుకు వచ్చి పార్టీ నాయకులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించలేదు.తెలంగాణలోనూ మొన్నీమధ్య ఉమ్మడి రాష్ర్టంలో రెండు సార్లు పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ టీఆర్ఎస్లో చేరిపోయిన సంగతి తెలుసు.పార్టీలో అంతర్గత కలహాలు ఎక్కువగా ఉన్నాయి.
కొన్నాళ్లలో మళ్లీ తెలంగాణకు వస్తారేమో.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి కదా…!
.