కేరళలోని కొచ్చి నగరంలో అనంతు కృష్ణన్ అనే 26 ఏళ్ల యువకుడు అరెస్ట్ అయ్యాడు.ఇతగాడు పెద్ద కంపెనీల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో సగం ధరకే స్కూటర్లు, కుట్టుమిషన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పిస్తానని చెప్పి కోట్లాది రూపాయలు కొల్లగొట్టాడు.
రెండు ముక్కల్లో చెప్పాలంటే, అమాయక ప్రజల్ని నమ్మించి నిండా ముంచాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2022 సంవత్సరం నుంచి ఈ మోసం నడుస్తోంది.
ఇప్పటికే ఇతనిపై మువ్వట్టుపుళ, ఇడుక్కి ప్రాంతాల్లో చాలా మోసపూరిత కేసులు ఉన్నాయి.తాజాగా మరో కొత్త కేసులో ఇతను బుక్కయ్యాడు.
ఈ కేసులో కాంగ్రెస్ నాయకురాలు లాలీ విన్సెంట్, మరో ఆరుగురి పేర్లు కూడా ఉన్నాయి.దాదాపు 400 మందికి పైగా బాధితులు అనంతు కృష్ణన్, ‘సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ స్టడీస్‘ (SPIARDS) అనే NGO సంస్థపై ఫిర్యాదు చేశారు.
ఈ NGOకి లాలీ విన్సెంట్ లీగల్ అడ్వైజర్ గా ఉన్నారు.
లాలీ విన్సెంట్ మాత్రం అనంతు కృష్ణన్ను వెనకేసుకొచ్చారు.
అతడు తనకు కొడుకు లాంటివాడని, బలిపశువును చేశారని వాపోయారు.అనంతు కృష్ణన్ మొదట్లో కొంతమందికి స్కూటర్లు, ఇతర వస్తువులు ఇచ్చాడని, ఆపై CSR నిధులు రాకపోవడంతో ఇబ్బందులు పడ్డాడని ఆమె చెప్పారు.కానీ, పోలీసులు మాత్రం చాలా మందికి స్కూటర్లు అసలు అందలేదని తేల్చారు.’సీడ్ సొసైటీ’కి చెందిన వందలాది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.తమ సొసైటీ సెక్రటరీ తమను మోసం చేశారని వారు ఆరోపించారు.కొంతమందికి తక్కువ ధరకే ల్యాప్టాప్లు, కుట్టుమిషన్లు, ఫుడ్ కిట్లు వచ్చినట్టు చూడటంతో తామూ డబ్బులు కట్టామని బాధితులు వాపోయారు.

మోసం ఎలా జరిగిందంటే, అనంతు కృష్ణన్ ‘మువ్వట్టుపుళ సోషియో-ఎకనామిక్ డెవలప్మెంట్ సొసైటీ’ అనే ఒక ఫేక్ సొసైటీని సృష్టించాడు.సొసైటీ సభ్యులు తమ కన్సల్టెన్సీలో డబ్బులు డిపాజిట్ చేస్తే, సగం ధరకే స్కూటర్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు.అంతేకాదు, తాను నేషనల్ NGO ఫెడరేషన్ జాతీయ సమన్వయకర్త అని, CSR నిధులు తన చేతుల మీదుగానే పంపిణీ అవుతాయని గొప్పలు చెప్పుకున్నాడు.కానీ అదంతా ఉత్త డొల్ల మాటలే.

విచారణలో అనంతు కృష్ణన్ ఒక్క మువ్వట్టుపుళలోనే రూ.9 కోట్లు, కేరళ వ్యాప్తంగా 62 “సీడ్ సొసైటీల” ద్వారా రూ.20 కోట్లకు పైగా మోసం చేసినట్లు తేలింది.చాలా కంపెనీలకు ఈ స్కామ్ గురించి అసలు తెలియదు.
చివరకు అనంత కృష్ణన్ కూడా తాను ఏ కంపెనీ నుంచి CSR నిధులు పొందలేదని ఒప్పుకున్నాడు.ఇప్పుడు పోలీసులు ఈ మోసంలో రాజకీయ నాయకుల పాత్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.







