నల్లగొండ జిల్లా:నాంపల్లి మండలంలో అభివృద్ది సంక్షేమ పథకాలలో భాగంగా ప్రభుత్వాలు లక్షల రూపాయల ప్రజాధనంతో సీసీ రోడ్లు నిర్మిస్తే,ఎయిర్ టెల్ నెట్ వర్క్ ఫైబర్ కేబుల్ పనుల కోసం సీసీ రోడ్లను విచ్చలవిడిగా తవ్వి,వారి పని పూర్తైనా మరమ్మతులు చేపట్టకుండా అలాగే నెలల తరబడి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్మించిన సీసీ రోడ్లను గ్రామపంచాయతీ అనుమతితో తవ్వి తిరిగి యధావిధిగా రోడ్డును నిర్మించే బాధ్యత సంబంధిత సంస్థ కాంట్రాక్టర్ పై ఉంటుందని,కానీ,ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదని,కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా సీసీ రోడ్లు తవ్వేస్తూ రోడ్లపై గుంతలు చేసి,వాటిని నెలల కొద్దీ పూడ్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు.
ధ్వంసం చేసిన సీసీ రోడ్లు పూడ్చలంటే ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించాల్సి రావడంతో స్థానిక అధికారులకు,ప్రజా ప్రతినిధులకు కాంట్రాక్టర్ ఎంతో కొంత ముట్టజెప్పి ప్రజల కంట్లో మట్టిగొట్టి పోతున్నారని ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మండలంలో జరుగుతున్న ఎయిర్ టెల్ నెట్ వర్క్ కేబుల్ పనుల కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని,పగుల గొట్టిన సీసీ రోడ్లను యధావిధిగా నిర్మాణం చేసేలా చూడాలని కోరుతున్నారు.