ఏపీ లో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.ఓటు వేసేందుకు భారీగా జనాలు తరలివస్తున్నారు.
అయితే వీరిలో మహిళా ఓటర్లే ఎక్కువమంది ఉండడం, తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారే ఎక్కువ మొగ్గు చూపిస్తుండడం తదితర కారణాలతో పోలింగ్ కేంద్రాల వద్ద మహిళల సందడి ఎక్కువ కనిపిస్తోంది.ఓటు వేసేందుకు మహిళలు ఎక్కువగా వస్తూ ఉండడంతో, ఏ పార్టీకి అది కలిసి వస్తుంది అనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.అయితే ఇదంతా తమకు అనుకూలంగా మారుతుందని టిడిపి, వైసిపిలు లెక్కలు వేసుకుంటున్నాయి.2019 ఎన్నికల విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే.అప్పట్లోనూ మహిళ ఓటర్లు ఎక్కువమంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.దీంతో అవి తమకు కలిసి వస్తాయని, ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పథకం ద్వారా పదివేల నగదును మహిళల ఖాతాల్లో వేయడంతో, ఆ ఓట్లన్నీ తమకే పడతాయని టిడిపి భారీగా ఆశలు పెట్టుకుంది.
పోలింగ్ ముగిసిన తరువాత సైతం టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu) ఇదే అంచనా వేశారు.పసుపు కుంకుమ ఎఫెక్ట్ బాగా ఉందని, అందుకే మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారని, తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

కానీ ఫలితాలు తర్వాత టిడిపి కేవలం 23 స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది.ఆ లెక్కన మహిళలు ఎక్కువ శాతం వైసీపీకి ఓటు వేశారని అర్థమైంది.అయితే ఈసారి కూడా మహిళలే అధిక సంఖ్యలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉండడంతో, ఇప్పుడు ఏ పార్టీకి అది కలిసి వస్తుందో తేలాల్సి ఉంది.ప్రభుత్వ వ్యతిరేకత మహిళల్లో ఎక్కువ ఉందని, అది తమకు కలిసి వస్తుందని టిడిపి ప్రస్తుతం ఆశలు పెట్టుకుంది.
ఏపీలో అభివృద్ధి కుంటిపడడం, మధ్య నిషేధం చేయకపోవడం, శాంతి భద్రత సమస్యలు వంటివన్నీ మహిళల్లో ఆలోచన రేకెత్తించాయని, కచ్చితంగా వారంతా ఎన్డీఏ కూటమి వైపే మొగ్గు చూపుతారని టిడిపి అంచనా వేస్తోంది.టీడీపీ మ్యేనిఫెస్టో( TDP Manifesto ) లో ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, తల్లికి వందనం పేరిట కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా వారందరికీ డబ్బులు ఇస్తామని ప్రకటించడం వంటివి తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.

ఇక వైసీపీ( YCP ) సైతం మహిళా ఓటర్లు తమకు అనుకూలంగానే ఓటు వేస్తారని, ఈ ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ మహిళల పేరు మీదే ఇవ్వడం, వారి బ్యాంకు ఖాతాలోనే సొమ్ములు జమ చేయడం, ఇల్లు, ఇళ్ల స్థలాలు వారి పేరు రజిస్ట్రేషన్ చేయడం ఇవన్నీ లెక్కలు వేసుకుని వైసిపి వైఫై మొగ్గు చూపుతారని ఆ పార్టీ అంచనా వేస్తోంది.







