యాదాద్రి భువనగిరి జిల్లా: దెబ్బకు తాతలు దిగొచ్చారనే సామెత ఈ తరం వారికి చాలా మందికి తెలియకపోవచ్చు.కానీ, ప్రస్తుతం రాష్ట్రంలో తాండవిస్తున్న కరువు దెబ్బకు తాతల నాటి చేతి పంపులే వాటర్ సమస్యకు ఆల్టర్ నేట్ గా కనిపిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వమే మూలకు పడ్డ చేతి పంపులను వెతికి మరీ మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించడంతో మళ్ళీ బోరింగ్ మెకానిక్ లు ఫానా రేంచ్ ల బ్యాగ్ తో పల్లెల్లో కనిపిస్తున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని పలు తండాలు,గ్రామాల్లో నీటి కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
వానలు లేక చెరువులు భూగర్భ జలాలు ఎండిపోయిన బోర్లు,బావులు అడుగంటి పంట పొలాలు ఎండిపోగా,ప్రస్తుతం పల్లెల్లో తాగునీటి కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు.ప్రజల దాహార్తిని తీర్చే మార్గం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వానికి పూర్వకాలంలో ప్రజలకు అన్ని రకాల నీటి అవసరాలు తీర్చిన చేతిపంపులు గుర్తుకొచ్చాయి.
స్విచ్ ఆన్ చేయగానే నీళ్ళు బయటికి వచ్చే మోడ్రన్ మోటార్లు వచ్చాక హ్యాండ్ పంపులు పూర్తిగా విస్మరించబడి,వాడుకలో లేక కొన్ని లేకుండా చేస్తే,కొన్ని అలాగే తుప్పు పట్టి ఉండి పోయాయి.ఇప్పుడు ఏళ్ల క్రితం పక్కకు పడేసిన చేతి పంపులు రిపేర్ చేస్తూ నీటి సమస్యక పరిష్కారం చూపుతున్నారు.
అందుకే అంటారు ఎంత మోడ్రన్ లైఫ్ కి అలవాటుపడినా,ఎన్నిరకాల అలవాట్లు మారినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మన పూర్వీకులు ఊరకే అనలేదు సుమా…!ఎన్ని మిషన్ భగీరథలు వచ్చినా,ఇంట్లో నల్లా తిప్పినా చేతి పంపుల కింద దిగదుడుపేనని కరువు కళ్ళకు కట్టినట్లు చూపించింది.ఇప్పటికైనా చేతి పంపులకు చేయూత నిచ్చి కాపాడుకోండి.
కరెంట్ ఉన్నా లేకున్నా మీ ఇంటికి నీటి సమస్య రాకుండా చూస్తుంది.







