సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్ళచెర్వు మండలం నక్కగూడెం లిఫ్ట్ పునరుద్ధరణకు రాష్ట్ర భారీ నీటి పారుదల,పౌర సరఫరా శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి,రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నక్కగూడెం లిఫ్ట్ పునరుద్ధరణ ద్వారా ఈ ప్రాంతంలో 3200 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు.ఈ లిఫ్ట్ మరమ్మత్తులకు దాదాపు రూ.35 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, అలాగే ఈ ప్రాంత రోడ్లలు చేపట్టుటకు మరో రూ.40 కోట్లు అందించనున్నట్లు తెలిపారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన రోడ్లు, లిఫ్టులు గత పాలకుల మరమ్మత్తులు చేపట్టకపోవడం వలన ఈ ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారిందని,ఇకపై ఇందిరమ్మ పాలనలో అన్ని లిఫ్టులు,రోడ్లు చేపడతామని తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్టు వలన రైతులకు మేలు జరగలేదని,కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా అయ్యిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇకపై రాష్ట్రంలోని మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని స్పష్టం చేశారు.అర్హులైన వారందరికీ ఆరు గ్యారంటీలు పక్కాగా అందిస్తామని,అలాగే రాష్ట్రంలో సంపద, వనరులు ప్రజలకే అందాలని ప్రభుత్వం ఆదిశగా దృఢ సంకల్పంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టం తెచ్చినా గిరిజనులకు పోడుపట్టాలు అందించలేదని,త్వరలో గిరిజనులకు పోడు పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన లిఫ్టులు,రోడ్లు ఈ ప్రాంతంలో కనబడుతున్నాయని,10 సంవత్సరాలు కొనసాగిన ప్రభుత్వంలో ప్రజలు, రైతులు ఎంతో నష్టపోయారని విమర్శించారు.
కాళేశ్వరం సమస్యలు చెప్పలేన్నని ఉన్నాయని,ప్రజా ధనం ఎంతో దుబారా జరిగిందన్నారు.ఈ నెల 27 న త్వరలో మరో రెండు పథకాలు సిఎం రేవంత్ రెడ్డి,ప్రియాంక గాంధీ చేతుల మీదుగా రూ.500 లకు గ్యాస్ సిలెండర్,పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచితంగా అందిస్తామని అన్నారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన సేవలందించాలని,గత ప్రభుత్వం ప్రజలకు మెప్పించి చేపట్టిన పనుల్లో కమిషన్లు కక్కుర్తి పడ్డారని పేర్కొన్నారు.
లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంత రైతాంగ సాగు గణనీయంగా పెరుగుతుందని,అలాగే త్వరలో రోడ్లను చేపట్టనున్నట్లు తెలిపారు.అనంతరం దొండపాడులో రూ.400 కోట్లతో చేపట్టే ఇన్నోవేరా ప్యాక్టరీ నిర్మాణానికి సహచర మంత్రులతో కలసి భట్టి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్,ఎస్పీ రాహుల్ హెగ్డే,నీటి పారుదల చీఫ్ ఇంజనీర్ రమేష్,అదనపు కలెక్టర్ ఏ.వెంకట్ రెడ్డి,అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఆర్.డి.ఓ జగదీశ్వర్ రెడ్డి, తహసీల్దార్ జ్యోతి,వివిధ శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.







