రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందించాలని, గర్భిణీ స్త్రీలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఛాంబర్ లో వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి, ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న సేవల తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.సిరిసిల్ల జిల్లా ఆసుపత్రితో పాటు వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆసుపత్రుల్లో అందిస్తున్న సేవలపై ప్రత్యేకంగా అభిప్రాయాన్ని తెలుసుకోవడం జరిగిందని తెలిపారు.
వారి అభిప్రాయం మేరకు ఇంకా ఏమైనా మెరుగుపరచాల్సిన వసతులు, సౌకర్యాలు ఉంటే వాటిని వెంటనే సమకూర్చాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను ముఖ్యంగా ప్రసవానంతరం ఇంటి వద్ద దింపడానికి వాహనాలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.
లింగన్నపేట, అంబేద్కర్ నగర్, హన్మాజిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్క్వాస్ గుర్తింపుకు అవసరమైన పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చి, ఎన్క్వాస్ గుర్తింపు వచ్చేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.ఈ సమీక్షలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.సుమన్ మోహన్ రావు, ఆర్ఎంఓ డా.సంతోష్, పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, డా.మహేష్ రావు, మున్సిపల్ కమీషనర్ మీర్జా ఫసత్ అలీ బేగ్, తదితరులు పాల్గొన్నారు.







