ఓ వ్యక్తి ప్రసాదంలో విషం కలిపి తన సొంత పిల్లలకు పెట్టి, వారు చనిపోకపోవడంతో గొంతు నులిమి హతమార్చాడు.ఈ ఘటన తమిళనాడు( Tamil Nadu )లోని క్రిష్ణగిరి జిల్లా కావేరి పట్నం సమీపంలో ఉండే N.
తట్టకల్ గ్రామంలో చోటుచేసుకుంది.అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.N.తట్టకల్ గ్రామంలో నివాసం ఉండే కడలరసు (32)కు ధర్మపురి సాహితీ సంస్థకు చెందిన జనని (23)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది.వీరికి దేవరాజ్ (4), నివంతిక (2) అనే పిల్లలు సంతానం.
కడలరసు ఒక కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

గత కొంతకాలంగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడం ప్రారంభమైంది.శనివారం కడలరసు కుటుంబ సమేతంగా పెరియమలై దేవాలయానికి వెళ్ళారు.అయితే మార్గమధ్యంలో కడలరసు కొండ దిగువన అందించే ప్రసాదం కొనుగోలు చేసి అందులో విషం కలిపి ఆ ప్రసాదం తన ఇద్దరు పిల్లలకు ఇచ్చాడు.
ప్రసాదం తిన్న ఆ పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు కానీ చనిపోలేదు.ఈ విషయం గమనించిన కడలరసు గొంతు నులిమి చిన్నారులను హతమార్చాడు.

ఆ తర్వాత విషం కలిపిన ప్రసాదాన్ని భార్య జననికి ఇచ్చాడు.చివరికి తాను కూడా ఆ విషయం కలిపిన ప్రసాదం తిని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.విషం తిన్న జనని కేకలు వేయడంతో పక్కనే ఉండే స్థానికులు గుర్తించి నాగర సంబట్టి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు వెంటనే ఈ భార్యాభర్తలను ఆంబులెన్స్ లో కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చిన్నారుల మృతదేహాలను కూడా పోస్ట్మార్టం నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికే తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దంపతులు కోలుకున్నాకే ఈ ఘటనకు గల కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.







