ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.ఈ వ్యాఖ్యలతో కెనడాతో పాటు ప్రపంచవ్యాప్తంగా వున్న ఖలిస్తాన్( Khalistan ) మద్ధతుదారులు, సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పలు చోట్ల భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు సైతం జరుగుతున్నాయి.తాజాగా కెనడా గొడవ అమెరికాకు పాకింది.
ఏకంగా భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధుని ఖలిస్తాన్ మద్దతుదారులు అడ్డుకున్నారు.
వివరాల్లోకి వెళితే.
సిక్కు మత వ్యవస్ధాపకుడు గురునానక్ జయంతి( Gurunanak Jayanthi ) సందర్భంగా న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్లో వున్న హిక్స్విల్లే గురుద్వారాలో( Hicksville Gurdwara ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తరణ్జిత్ సింగ్ సంధూ( Taranjit Singh Sandhu ) పాల్గొని ప్రసంగించారు.అనంతరం తిరిగి వెళ్తుండగా ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆయనను ఒక్కసారిగా చుట్టుముట్టారు.
ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ పాత్ర వుందని ఆరోపించారు.అలాగే సిక్కు వేర్పాటువాద సంస్థ ‘‘సిక్స్ ఫర్ జస్టిస్’’ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు సైతం కుట్ర పన్నారని పేర్కొన్నారు.
అయితే గురుద్వారా నిర్వాహకులు, భద్రతా సిబ్బంది సాయంతో సంధూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా.ఈ ఏడాది సెప్టెంబర్లో బ్రిటన్లో భారత రాయబారిని ఓ గురుద్వారాలోకి ప్రవేశించకుండా ఖలిస్తాన్ మద్ధతుదారులు అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.స్కాట్లాండ్లోని అల్బర్ట్ డ్రైవ్లోని గ్లాస్గో గురుద్వారా కమిటీ సభ్యులతో భేటీ అయ్యేందుకు యూకేలోని భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి( Vikram Doraiswami ) వచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న ఖలిస్తాన్ సానుభూతిపరులు ఆయనను గురుద్వారాలోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.లోపలికి వెళ్లనిచ్చేది లేదని.చివరికి గురుద్వారా సిబ్బందిని కూడా బెదిరించారు.ఈ క్రమంలో అక్కడ స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
అయితే ఖలిస్తాన్ సానుభూతిపరులు వెనక్కి తగ్గకపోవడంతో చేసేదేం లేక దొరైస్వామి చివరికి అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఈ ఘటనను భారత ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది.తమ రాయబారిని అడ్డుకున్న విషయాన్ని యూకే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.దీనిపై స్థానికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే దొరైస్వామి అక్కడికి వచ్చినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో బ్రిటన్లోనూ ఖలిస్తాన్ గ్రూపులు యాక్టీవ్ అవుతున్నట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఏడాది మార్చిలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ వ్యవహారం భారత్తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే.లండన్లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద ఖలిస్తాన్ వేర్పాటువాదులు నిరసన తెలపడంతో పాటు త్రివర్ణ పతాకానికి అవమానం కలిగేలా ప్రవర్తించారు.







