తెలంగాణలో తప్పకుండా తాము అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్న కాంగ్రెస్ ( Telangana Congress )దానికి అనుగుణంగానే వ్యూహాలు రచిస్తోంది.ముఖ్యంగా గ్రామీణ ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది.
బీఆర్ఎస్ కు గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉన్నా, బిజెపికి( BJP ) అక్కడ బలం అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రభుత్వం వ్యతిరేక ఓటు తమకు కలిసి వచ్చి, కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపుతారనే అంచనాతో ఉంది.అందుకే ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ఓటర్లను ఆకట్టుకునే విధంగా అనేక హామీలను ఇస్తోంది.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ( BRS ) దళిత బంధు , రైతుబంధు, 9 గంటలకు విద్యుత్ సరఫరా ఇస్తూ వాటిని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉండడం తో కాంగ్రెస్ కూడా అంతే స్థాయిలో ఎన్నికల హామీలు ఇస్తూ, గ్రామీణ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.పట్టణాలు, నగరాల్లో ఫైర్ బ్రాండ్ నేతలను రంగంలోకి దింపింది. గ్రామాల్లో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ, స్థానికంగా నెలకొన్న సమస్యలు, రైతులు, రైతు కూలీలు మహిళలు పడుతున్న ఇబ్బందులపై ప్రధానంగా దృష్టి సారించింది.
ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 6 గ్యారంటీలను గురించి వివరిస్తున్నారు.ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను కవర్ చేసే విధంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వం దిశా నిర్దేశం చేస్తుంది.
ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని ఓటర్లను సెంటిమెంట్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని, తమ పాలన ఏ విధంగా ఉంటుందో చూడాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైనా బిజెపి ప్రభావం పెద్దగా ఉండదనే అంచనాలో కాంగ్రెస్ ఉంది.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపరు అని , కానీ గ్రామీణ ప్రాంతంలో చైతన్యం ఎక్కువగా ఉంటుందని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకుంటారని , వారి ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంటుందని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలోపేతం అయ్యేవిధంగా ప్రజల దృష్టి తమ పార్టీ పై పడే విధంగా కాంగ్రెస్ అధిష్టానం సూచనలతో ప్రతి గ్రామాన్ని జల్లెడ పడుతూ ఎన్నిక ప్రచారాన్ని ముమ్మరం చేసే పనుల్లో తెలంగాణ కాంగ్రెస్( Telangana Congress ) నాయకులు నిమగ్నం అయ్యారు.







