ఏకంగా బస్టాప్( bus stop ) లేపేయడమేమిటి, మీ పిచ్చికాకపోతే? అని అవాక్కవ్వద్దు.ఇపుడు ఇక్కడ చెప్పబోయే విషయం తెలిస్తే మీ కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం.
సాధారణంగా బస్టాపుల వద్ద, రైల్వే స్టేషన్లో జేబు దొంగలను చూస్తుంటాం.అదేవిధంగా పిల్లలను ఎత్తుకెళ్లేవారిని, సామగ్రిని చోరీ చేసేవారిని గురించి మనం తరచూ వింటుంటాం.
అయితే, బెంగళూరులో( Bangalore ) ఏకంగా ఓ బస్టాప్నే ఎత్తుకెళ్లారు కొంతమంది కేటుగాళ్ళు.వారం రోజుల క్రితమే కన్నింగ్హామ్ రోడ్లో ఆ బస్టాపుని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ( Metropolitan Transport Corporation )వారు నిర్మించడం జరిగింది.కాగా దానికి దాదాపు రూ.10 లక్షల ఖర్చు చేశారు.బస్టాపుని దిట్టంగా స్టెయిన్లెస్-స్టీల్ తో మరీ తయారు చేశారు.

దాంతో ఆ స్టీల్ పైన కన్నేసిన దుండగలు ఎలాగైనా దోచుకెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు.కట్ చేస్తే ఎవరూ లేని సమయంలో వాటిని కట్ చేసి చోరీ చేసి తీసుకెళ్లారు.ఈ నేపధ్యంలో బస్టాప్ ను నిర్మించిన కంపెనీ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ… తాము కాఫీ డేకి దగ్గరలో బస్టాప్ నిర్మించామని, ఆగస్టు 21న దాన్ని దిగ్విజయంగా ప్రారంభించామని తెలిపారు.
కాగా ఆగస్టు 28న అది మాయమైపోయిందని ఆశ్చర్యపోతూ చెప్పారు.బస్టాప్ ను ఉద్దేశపూర్వకంగానే తీసేశారా అని బీబీఎంపీ అధికారులను అడిగామని, తామేం తీయలేదని వారు చెప్పారని వివరించారు.

ఇక దాంతో చేసేదేమీ లేక తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో ప్రయాణికులు కూడా స్పందిస్తూ బస్సులు ఎక్కడానికి అక్కడికి వచ్చి ఒక్కోసారి ఎండకు ఎండి, వానకు తడిచిపోతున్న పరిస్థితి వస్తుందని స్థానిక మీడియాతో వాపోయారు.కాగా, ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకోవడానికి అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.బస్టాపులను ఎత్తుకెళ్లిన ఘటనలు గతంలోనూ పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆ సమాచారంతో దొంగలను అత్యంత త్వరలోనే పట్టుకుంటామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు.








