ఐదుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి భారత దేశవ్యాప్తంగా ఏకంగా 416 మోసాలకు పాల్పడి రూ.5.9 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.ఈ ముఠా సభ్యుల వద్ద లక్షకు పైగా ఆధార్ నెంబర్లు( Aadhaar numbers ) ఉన్న సమాచారం కడప పోలీసులకు అందడంతో ఈ ఐదుగురు సైబర్ నేరగాళ్లను కడప పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నిందితుల వద్ద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారికి చెందిన లక్షకు పైగా వేలిముద్రలు, ఆధార్ నెంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు వైయస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ బుధవారం వెల్లడించారు.ఈ నేరస్తులను పోలీసులు ఎలా పట్టుకున్నారో అనే వివరాలు చూద్దాం.
వివరాల్లోకెళితే.కడప రామాంజనేయపురం లోని ఎలక్ట్రికల్ కాలనీకి చెందిన ఎస్.శంకరయ్య ఫోన్ కు ఎటువంటి ఓటీపీ రాకుండానే బ్యాంక్ ఖాతా నుంచి రూ.5500 విత్ డ్రా అయ్యాయి.దీనిపై శంకరయ్య 2022 డిసెంబర్ 13న కడప సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో కేసు నమోదు చేశారు.

తాజాగా రెండు రోజుల క్రితం బాధితుడైన శంకరయ్యకు వెంకటేష్ అనే వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా నీవు సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో నా బ్యాంకు ఖాతా జప్తు అయిందని, నా ఖాతా యథాస్థితికి రాకుంటే చంపేస్తానని బెదిరించాడు.ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.దీంతో శంకరయ్య పోలీసులను ఆశ్రయించాడు. ఏఎస్పీ తుషార్ డూడి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, విచారణ చేపట్టారు.గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లవారిపాలెం లో ఉండే బ్యాంక్ లోని శంకరయ్య ఖాతా నుంచి రూ.5500 డ్రా అయినట్లు పోలీసులు గుర్తించారు.బాధితుడికి వచ్చిన కాల్ డేటా ఆధారంగా లొకేషన్ గుర్తించగా కడపలో ఉన్నట్లు తెలిసింది.

కడప పాతబైపాస్ వద్ద ప్రధాన నిందితుడైన ప్రకాశం జిల్లా( Prakasam ) దోర్నాల మండలం సుందరయ్య కాలనీకి చెందిన నల్లగల్ల వెంకటేష్ తో పాటు అతనికి సహకరించిన గుంటూరులోని శ్రీనివాస పేటకు చెందిన మల్ల అజయ్, గంటా కళ్యాణ్, పసుపులేటి గోపి, పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన షేక్ జానీలను పోలీసులు అరెస్టు చేశారు.ఈ సైబర్ నేరగాళ్లు( Cyber criminals ) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం ద్వారా బాధితుల వేలిముద్రలను బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ ఏజెంట్లు, బ్యాంక్ కస్టమర్ సర్వీస్ పాయింట్ల నుండి సేకరించి వాటిని కంప్యూటర్లో నకిలీలు తయారు చేశారు.వాటి సాయంతో బాధితుల ఆధార్ కార్డులకు లింక్ ఉన్న బ్యాంకు ఖాతాల నుండి నగదు డ్రా చేస్తున్నారు.
పోలీసులు వీరి వద్ద నకలి వేలిముద్రల తయారీ పరికరాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్, కారు స్వాధీనం చేసుకున్నారు.







