సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నెల 29,30 న నిర్వహించే గ్రూప్ -2 పరీక్షలను వాయిదా వేయాలని, గురుకుల పరీక్షల పూర్తి అయిన నెలరోజుల తర్వాత తిరిగి పరీక్షలను నిర్వహించాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్) రాష్ట్ర అధ్యక్షుడు ఇందూరు సాగర్ డిమాండ్ చేశారు.గురువారం జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పివైఎల్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోటి ఆశాలతో తొమ్మిదేళ్లుగా ఎదురుచూడగా గురుకుల, గ్రూప్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారని,ఈ నెల ఒకటి నుండి 23 వరకు గురుకుల పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఇదే నెలలోనే గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.
గురుకుల పరీక్షలు రాస్తూ గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు 5 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారని, ఒకే నెలలో ఇన్ని పరీక్షలు నిర్వహించడంతో అభ్యర్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారని తెలిపారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ స్పందించి గ్రూప్ 2 పరీక్షలను రెండునెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల నేపథ్యంలో వేస్తున్న ఉద్యోగాల విషయంలో పారదర్శకంగా ఉండాలని, నిరుద్యోగులకు ఆటంకాలు లేకుండా నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.వెంటనే జంభో నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పివైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్లగొండ నాగయ్య,ప్రధానకార్యదర్శి దారవత్ రవి,సహాయ కార్యదర్శి వీరబోయిన రమేష్,కోశాధికారి బండి రవి,సభ్యులు బాదే నాగరాజు,పొన్నం బ్రహ్మం, గిరి తదితరులు పాల్గొన్నారు.