సూర్యాపేట జిల్లా:అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని నరేంద్ర మోడీ( Narendra Modi ) ప్రభుత్వం తొమ్మిదేళ్ళ కాలంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తూ బడ్జెట్ ను కుదించి వేస్తుందని ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కమిటీ నేతల ములకలపల్లి రాములు,మట్టిపల్లి సైదులు,రెమిడాల రాజు, ధూళిపాళ్ల ధనుంజయ నాయుడు,దాసరి శ్రీనివాస్ ఆరోపించారు.సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉమ్మడి వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ రంగం( Agriculture sector )లో యంత్రాలు రావడంతో వ్యవసాయ కార్మికులకు పని దొరకటం లేదని,ఉపాధి హామీ పైనే వ్యవసాయ కూలీలు ఆధారపడి జీవిస్తున్నారని, అలాంటి వారి జీవితాలను నాశనం చేస్తూ ఉపాధిని రద్దు చేస్తే వ్యవసాయ కార్మికులు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ( BJP )ప్రతి సంవత్సరం ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గిస్తూ ఉపాధి కూలీల నోట్లో మట్టి కొడుతుందని విమర్శించారు.సూర్యాపేట జిల్లాలో రూ.11 కోట్లకు పైగా ఉపాధి కూలీల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని,వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన మొబైల్ మానిటరింగ్ సిస్టం వల్ల ఉపాధి కూలీలు రెండు పూటలా ఫోటోలు అప్లోడ్ చేయాలని నిబంధనలు పెట్టడం మూలంగా ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే ఈ విధానాన్ని రద్దు చేయాలన్నారు.
ఉపాధి కూలీలకు పార,గడ్డపార, తట్ట,గొడ్డలి,కొడవలి వంటి పనిముట్లు ఇవ్వాలని,పని ప్రదేశంలో టెంటు,మెడికల్ కిట్టు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని,వృద్ధులకు, వికలాంగులకు తేలికపాటి పనులు కల్పించాలని,ప్రతి కూలికి 200 రోజులు పని కల్పించి,పెరిగిన ధరలకు అనుగుణంగా రోజు కూలి రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.పని కావాలని దరఖాస్తు చేసుకున్న ప్రతి కూలీకి వెంటనే జాబ్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.
పెండింగ్ లో ఉన్న మెడికల్ బిల్లులను సత్వరమే విడుదల చేయాలని,ఉపాధి కూలీల కోసం కేటాయించిన నిధులను కేంద్ర ప్రభుత్వం గ్రామాలలో సిసి రోడ్లు, అంగన్వాడి బిల్డింగులు, పశు వైద్యశాలలు, గ్రామపంచాయతీ బిల్డింగులు,పల్లె ప్రకృతి వనాలు,స్మశాన వాటికలు, రైతు వేదికలు తదితర వాటి నిర్మాణం కోసం ఖర్చు చేయడం దుర్మార్గమైన చర్యని అన్నారు.ఉపాధి హామీలో కీలక పాత్ర పోషిస్తున్న మేట్లకు సైకిల్,సెల్ ఫోన్, పారితోషకం ఇవ్వాలన్నారు.
కొలతలు లేకుండా పనికి వెళ్లిన ప్రతికూలికి ప్రభుత్వం నిర్ణయించిన వేతనం ఇవ్వాలన్నారు.సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాలలో ఫీల్డ్ అసిస్టెంట్ నియమించాలని, మున్సిపాలిటీలలో విలీనమైన గ్రామాలలో కూలీలకు పని కల్పించాలని కోరారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ ఏవో శ్రీదేవికి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు,ఉపాధి హామీ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.