కడప ఎంపీ అవినాశ్ రెడ్డి( MP Avinash Reddy ) ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో( Telangana High Court ) విచారణ జరిగిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 26 న న్యాయమూర్తులపై అవినీతి ఆరోపణలు చేసిన సస్పెండ్ జడ్జిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎంపీ అవినాశ్ కేసు విషయంలో హైకోర్టు జడ్జిలకు డబ్బు సంచులు ముట్టాయని, అందుకే ఆయన అరెస్ట్ కావడం లేదంటూ ధర్మాసనంపై, న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించింది.
దీంతో అందుకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తూ ప్రసారం అయిన చర్చా కార్యక్రమాల వీడియో ఫుటేజీ మొత్తం తమ ముందు ఉంచాలని హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్ రిజిస్ట్రార్ ను ఆదేశించారు.
అయితే హైకోర్టు న్యాయమూర్తులు డబ్బు సంచులు తీసుకుని అవినాశ్ రెడ్డిని సీబీఐ ( CBI ) అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నారని సస్పెండ్ అయిన ఓ జడ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ చర్చల్లో కొందరు పాత్రికేయులు, నాయకులు సైతం అందుకు భాష్యం చెప్పడంపై హైకోర్టు జడ్జి లక్ష్మణ్( High Court Judge Lakshman ) మండిపడ్డారు.తమకు మీడియా అంటే గౌరవం ఉందన్న ఆయన కానీ న్యాయాన్ని రక్షించే ధర్మాసనంపై, జడ్జిలపై అలాంటి వ్యాఖ్యలు చేయడంతో కలత చెందామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.వీడియో ఫుటేజీ ఇవ్వాలని ఆదేశించడం సంచలనంగా మారింది.

మరోవైపు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు న్యాయస్థానాలు, జడ్జిల మీద సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.వీరిలో కొందరిని అదుపులోకి తీసుకున్న అధికారులు మరికొందరిని విచారిస్తున్నారు.అయితే కోర్టులో ఉన్న ఓ కేసుపై విచారణ జరుగుతుండగా.న్యాయమూర్తులు లంచాలు, డబ్బు మూటలు తీసుకుని సహకరిస్తున్నారు అని ఓ మాజీ జడ్జి వ్యాఖ్యలు చేయడం, ఆ కామెంట్లను ఛానెళ్లు ప్రోత్సహించడంపై సర్వత్రా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజాలను ప్రజలకు చూపించాల్సిన ఛానెళ్లు కూడా కోర్టుల మీద అలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం.

వాస్తవాలను చూపించడం మానేసి ఛానళ్లు కూడా రాజకీయ రంగు పులుపుకుంటున్నాయా…? అందులో భాగంగానే న్యాయస్థానాలపై న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ వాటిని ప్రోత్సహిస్తున్నాయా.? అనేది ప్రశ్నార్థకంగా మారింది.నిజానికి అవినాశ్ రెడ్డి కేసులో సీబీఐకి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఇస్తే జడ్జిలు గొప్పగా వ్యవహారించారని, నిందితులకు సరైన గుణపాఠం చెప్పారని గంటల కొద్ది చర్చలు నిర్వహిస్తుంటారు.
అదే కేసులో అవినాశ్ రెడ్డికి ధర్మాసనం ముందస్తు బెయిల్ మంజూరు చేయగానే అదే కోర్టుపై ఛానళ్లు అవినీతి ఆరోపణలు చేయడం రాజకీయం కోసమా.? పబ్లిసిటీ కోసమా.? అసలు న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదని జర్నలిస్టులకు, సస్పెండ్ అయిన జడ్జికి తెలియని విషయమా.? అనేది ప్రతి ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న.అందరికీ సమ న్యాయాన్ని అందించే న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు, ఆరోపణలు చేసిన ఛానళ్లపై, సదరు వ్యక్తులపై హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.







