ఉమ్మడి ఖమ్మం జిల్లా కీలక నేత గుర్తింపు పొందన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ పరిణామాలు తర్వాత వారిద్దరి రాజకీయ భవిష్యత్తు ఏమిటి ? ఏ పార్టీలో చేరుతారు అనేది సర్వత్ర ఆసక్తికరంగా మారింది.బీఆర్ఎస్ ( BRS ) సస్పెండ్ చేయడంపై మీడియా సమావేశం నిర్వహించి మరి కెసిఆర్ పై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) విమర్శలు చేశారు.రానున్న రోజుల్లో తన సత్తా చూపిస్తానంటూ సవాల్ విసిరారు.
ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేతగా గుర్తింపు పొందిన పొంగులేటిని చేర్చుకోవడం ద్వారా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో( Khammam ) పార్టీని బలోపేతం చేయవచ్చని , వీలైనాన్ని ఎక్కువ సీట్లు సాధించవచ్చనే అభిప్రాయంతో కాంగ్రెస్ , బిజెపిలు ఉన్నాయి.

అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకునేందుకు పోటాపోటీ పడుతున్నాయి.అయితే ఈ విషయంలో బిజెపి ఎక్కువగా పొంగులేటికీ ప్రాధాన్యం ఇస్తోంది.ఆయన పార్టీలో చేరితే సముచిత స్థానం ఇస్తామని, రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి డోకా లేకుండా చూసుకుంటామంటూ ఆఫర్లు ఇస్తున్నారు.
ఇక పొంగులేటి కూడా బీఆర్ ఎస్ ను ఎదుర్కోవాలంటే జాతీయ పార్టీలో చేరడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు .దీనిలో భాగంగానే ఆయన బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈనెల 18 ఢిల్లీ వేదికగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భేటీ కాబోతున్నారట.

బిజెపిలో చేరితే తన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది తనతో పాటు , తన అనుచరులు ఎంతమందికి టికెట్లు ఇస్తారు ? తన వర్గానికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనే అంశాలపై చర్చించి, సానుకూల స్పందన వస్తే అప్పుడు బీజేపీలో చేరాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయించుకున్నారట. బిజెపి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాగా వేయవచ్చు అని, బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు , వీలైనంత ఎక్కువ సీట్లు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుంది అనే ఆలోచనతో ఉన్న బీజేపీ పొంగులేటి డిమాండ్ల పై సానుకూలంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది.







