ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, కడప, కర్నూల్ జిల్లాలలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పండ్ల పంటలలో చీని పంట ఒకటి.చీని పంట సాగు చేయాలి అనుకునేవారు, చీని అంట్ల తయారీ ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చీని అంట్ల ఎంపికలో లోపాలు సంభవిస్తే, పంట నష్టం ఊహించని రీతిలో ఉంటుంది.కాబట్టి మేలురకం విత్తనాలు, అంట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చు.
సరైన వేరు మూలాన్ని వాడకపోవడం వల్ల తోటలు తక్కువ సమయంలోనే క్షీణిస్తాయి.వేరుమూలంపై పెరిగే చీని చెట్టు వివిధ అంశాలలో ప్రభావితం చేస్తుంది.
కావున సరైన వేరు మూలంపై అంటుకట్టిన మొక్కలను నాటుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
వేరు మూలం అంటే రూట్ స్టాక్ అని అర్థం.
అంటు కట్టిన భాగానికి కింద ఉండే భాగాన్ని వేరు మూలంగా చెప్తారు.వేరుమూలంపై పెరిగిన చీని చెట్టు పెరుగుదల, పరిమాణం, ఆకారం, పోషకాల్ని భూమి నుండి గ్రహించడం, తెగుళ్ల నుండి శిలీంద్రాల నుండి తట్టుకునే శక్తి, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తితో పాటు నాణ్యతతో కూడిన దిగుబడికి దోహద పడతాయి.
కావున చీని అంట్ల తయారీ ఎంపికలో వేరు మూలమే ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఇక్కడ కనుక ఏవైనా లోపం జరిగితే మొదటి నుండి చివరి వరకు పంటలో వచ్చే తీవ్ర నష్టాన్ని భరించక తప్పదు.
నాసిరకం చీని అంట్లు ఎంపిక చేసుకుంటే వేరుకుళ్ళు, వైరస్, తెగుళ్లు లాంటి వాటితో పాటు నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల పంటలు బెట్టపోవడం, పంట నాణ్యత లోపం, పంటలకు వివిధ రకాల వైరస్ తెగుళ్లు తీవ్ర నష్టం కలిగించడం లాంటివి వచ్చి పంటను నాశనం చేస్తాయి.వ్యవసాయ క్షేత్ర నిపుణుల సలహాలతో చీని అంట్ల తయారీ ఎంపికలో మేలురకం విత్తనాల నుంచి తయారుచేసిన అంట్లను పంట సాగులో వినియోగిస్తే వివిధ రకాల తెగుళ్లు రాకుండా కాస్త పెట్టుబడి ఆదా అవడంతో పాటు నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.