చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.
నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.
భారతీయులు ఈ విషయంలో ముందున్నారు.కేంద్ర ప్రభుత్వం కృషి, ప్రవాసీ సంఘాల తోడ్పాటు కారణంగా భారతీయులు అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే మనలాగే ఎన్నో దేశాల వాసులకు అమెరికా డెస్టినేషన్ కావడంతో వారికి కూడా వీసాలు అందజేయడం అగ్రరాజ్యానికి ఇబ్బందిగా మారింది.అయినప్పటికీ కోటా పెట్టి వీసాలను సర్దుబాటు చేస్తూ వస్తోంది.
ఇకపోతే.అమెరికా వీసా కోసం భారతీయులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.విపరీతమైన పోటీతో పాటు సాంకేతిక కారణాలు, యూఎస్ రాయబార కార్యాలయాల్లో ఇబ్బందుల కారణంగా భారతీయుల దరఖాస్తులు పెండింగ్లో పడిపోతున్నాయి.ఈ నేపథ్యంలో వీసా బ్యాక్లాగ్లను తగ్గించడానికి యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ సమస్యపై ఏర్పాటైన ప్రెసిడెన్షియల్ కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలు చేయాలని డిసైడ్ అయ్యింది.వీసా అపాయింట్మెంట్ల కోసం భారతదేశం వెలుపల అమెరికన్ దౌత్య కార్యాలయాలను తెరవడం ఇందులో ఒకటి.

కరోనా వైరస్, లాక్డౌన్ తర్వాత ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత అమెరికా వీసా కోసం వివిధ దేశాల నుంచి డిమాండ్ మళ్లి పెరిగింది.ఇందులో భారత్ కూడా ఒకటి.సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రెసిడెన్షియల్ కమీషన్ సభ్యుడు ఇండో అమెరికన్ అజయ్ జైన్ భూటోరియా కృషి ఫలితంగా అమెరికా యంత్రాంగంలో కదిలిక వచ్చింది.అగ్రరాజ్యంలో చదువుకోవడానికి, ఆ దేశాన్ని సందర్శించడానికి పలువురు భారతీయులు నిరీక్షిస్తున్నారని ఆయన కమీషన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో వీలైన చోట వర్చువల్ ఇంటర్వ్యూలను అనుమతించాలని, అలాగే ప్రపంచవ్యాప్తంగా వున్న అమెరికా రాయబార కార్యాలయాల సిబ్బందిని, యూఎస్ కాన్సులేట్ సిబ్బందిని అధిక బ్యాక్లాగ్లు వున్న దౌత్య కార్యాలయాల్లో విధులకు కేటాయించాలని ప్రెసిడెన్షియల్ కమీషన్ సిఫారసు చేసింది.అలాగే వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి అదనపు వనరులను ఉపయోగించడం వంటి సిఫారసులు వున్నాయి.కాగా.భారతదేశంలోని యూఎస్ ఎంబసీ జనవరి 2023లో 1 లక్షకు పైగా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది.జూలై 2019లో అత్యధిక దరఖాస్తులను ప్రాసెస్ చేసింది.







