ఏపీలో ఎన్నికల సమయం దగ్గరకు వస్తున్న కొద్ది అధికార పార్టీ వైసీపీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి.ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు, కీలక నాయకులు ఒక్కొక్కరుగా పార్టీపై విమర్శలు చేస్తూ, పార్టీని వీడేందుకు సిద్ధమవుతుండడం , వారంతా ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవడం, ఇప్పటికే కొంతమంది టీడీపీ అధినేత చంద్రబాబుతోను రహస్యంగా ఈ విషయాలపై చర్చించడం , పార్టీలో చేరితే టిక్కెట్ ఇస్తామని హామీని పొందడం, వంటివి చోటుచేసుకున్నాయి పార్టీలో చేరికలు జోరు అందుకుంటే రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనని , తెలుగుదేశం పార్టీలోను ఉత్సాహం కనిపిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు .

అందుకే వీలైనంత ఎక్కువగా చేరుకులను ప్రోత్సహిస్తూ వైసిపి నుంచి వచ్చేవారికి పెద్దపేట వేస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా … ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకుల వలసలు పెరిగితే తమ పరిస్థితి ఏమిటనేది ఆయా నియోజకవర్గాలకు చెందిన టిడిపి కీలక నాయకులకు, నియోజకవర్గ ఇన్చార్జీలకు ఆందోళన కలిగిస్తోంది.ఇప్పటి వరకు పార్టీ కోసం తాము ఎంతో ఖర్చు పెట్టామని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నము అని, ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చి చేరే వారికి టిక్కెట్ హామీని ఇస్తే తమ పరిస్థితి ఏమిటి అని ఆందోళన టీడీపీ నాయకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.అదీ కాకుండా జనసేన పార్టీతో టిడిపి పొత్తు పెట్టుకోబోతున్న నేపథ్యంలో ఆ పార్టీకి కొన్ని సీట్లను కేటాయించాల్సి ఉంటుందని , అలాగే వామపక్ష పార్టీలకు పొత్తులో భాగంగా సీట్లను కేటాయిస్తే తమ సీట్లు ఎక్కడ గల్లంతవుతాయనే టెన్షన్ టిడిపి నాయకుల్లో మొదలైంది .

ఇక టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన సొంత టీం ను ఏర్పాటు చేసుకుంటూ ఉండడం, యువనాయకులకు ఎక్కువగా పెద్దపేట వేసేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో లోకేష్ జాబితా కూడా ఎన్నికలకు ముందు తెరపైకి వస్తుందని , అప్పుడు తమ సీటు ఉంటుందో లేదో అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.మొత్తంగా ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నాయకులు చేరితే పార్టీకి లాభం చేకూరినా , తాము నష్టపోతామనే బాధ టిడిపి టికెట్ పై ఆశలు పెట్టుకున్న నాయకుల్లో కనిపిస్తోంది.ఇప్పటికే నెల్లూరు రూరల్ , వెంకటగిరి నియోజకవర్గ నేతల్లో ఈ ఆందోళన మొదలయ్యింది.







