తెలంగాణలోని గల్ఫ్ వలస కార్మికులు ప్రభుత్వం నుంచి మెరుగైన మద్దతు, ప్రయోజనాల కోసం డిమాండ్ చేస్తున్నారు.ఈ ప్రయత్నంలో భాగంగా మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరమ్ (MRWF) ఆదివారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.అలానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం తమ సంక్షేమానికి రూ.500 కోట్లు (68 మిలియన్ డాలర్లు) కేటాయించాలని గల్ఫ్ వలస కార్మికుల సంఘాలు తాజాగా డిమాండ్ చేశాయి.
మైగ్రెంట్స్ రైట్స్ అండ్ వెల్ఫేర్ ఫోరమ్ (ఎంఆర్డబ్ల్యుఎఫ్) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఎంఆర్డబ్ల్యుఎఫ్ వ్యవస్థాపకుడు కోటపాటి నరసింహా నాయుడు దుబాయ్ నుంచి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో గల్ఫ్ కార్మికులు పోషించిన పాత్రను నొక్కి చెప్పారు.వారికోసం ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించాలన్నారు.వలస కూలీలు, వారి కుటుంబాల సంక్షేమానికి రూ.500 కోట్లు కేటాయిస్తారని కార్మికులు ఆశిస్తున్నారని నాయుడు తెలిపారు.ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశపెట్టిన తొమ్మిది బడ్జెట్లలో వారికి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించింది.అది 2018 బడ్జెట్లో ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం కేరళ తరహాలో ప్రవాసీ భారత్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఎంఆర్డబ్ల్యుఎఫ్ సమావేశంలో గల్ఫ్ తెలంగాణ అసోసియేషన్, గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్, ఇండియన్ పీపుల్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.వలస కార్మికుల సంక్షేమానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పథకాలను అమలు చేసేవారు.కానీ తెలంగాణ వచ్చాక గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకునే వారే కరవయ్యారు.2019, అక్టోబర్లో పంచాయతీరాజ్ శాఖ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు దిశగా అడుగులేసింది కానీ ఎందుకో వెనక్కి తగ్గింది.ఇదిలా ఉండగా, త్వరలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో వలస కార్మికుల లెక్కల విషయంలో సర్కారు దృష్టి సారించిందని తెలుస్తోంది.