మన తెలుగు సినిమా హీరోలంతా కూడా మలయాళ చిత్ర పరిశ్రమ వెనకాల పడుతూ ఉండడం గత కొన్ని ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం.చిరంజీవి నుంచి సుధీర్ బాబు వరకు ప్రతి ఒక్కరూ మలయాళ మార్కెట్ ని ఆధారంగా చేసుకుని అక్కడ సినిమాలను ఇక్కడ రీమేక్ చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు.
ఎందుకు మలయాళం మాత్రమే అంటే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.మలయాళం లో వచ్చే సినిమాలు అలాగే అక్కడ చూసే ప్రేక్షకులకు ఒక భిన్నమైన పంథా ఉంటుంది.
పైగా మలయాళం లో ప్రయోగాత్మక చిత్రాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.అక్కడి దర్శకులు అలవోకగా అలాంటి సినిమాలు తీస్తూ విడుదల చేస్తూ ఉంటారు.భారీ బడ్జెట్ కు వెళ్లకుండా ఎంత భిన్నమైన కథను కూడా తక్కువ బడ్జెట్ లో తీయడం మలయాళ చిత్ర దర్శకుల ప్రతిభ అని ఒప్పుకోక తప్పదు.అందుకే మన తెలుగు స్టార్ హీరోలు అంతా కూడా మలయాళం సినిమాలను రీమేక్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
ఇంకా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే హీరోయిజం అనే చట్రం లో నలిగిపోకుండా లేదా ఇరుక్కోకుండా ఎలాంటి విభిన్నమైన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉంటారు.మోహన్ లాల్ లాంటి ఒక స్టార్ హీరో పని వాడి పాత్రలో కూడా చేయగలడు.అలాగే మమ్ముట్టి లాంటి గొప్ప హీరో పాలవాడి పాత్రను కూడా పోషించగలడు.అందుకే మలయాళ సినిమా ఇండస్ట్రీ ఖచ్చితంగా అన్ని సినిమాల ఇండస్ట్రీలతో పోలిస్తే ఒక అడుగు ముందుంటుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.
అక్కడ నటిస్తున్న హీరోలు కూడా అందరూ హీరోల కన్నా భిన్నమైన వారు అని కూడా ఒప్పుకోవాల్సిందే.అక్కడ సినిమాలను పట్టుకొచ్చి మనదైన హీరోయిజం, కమర్షియల్ ఎలిమెంట్స్ , ఎలివేషన్ సీన్స్ జోడించి, మసాలా పూసి మళ్లీ దాన్ని రీమేక్ అనే అవసరం లేని ఒక పేరు పెట్టి తెలుగు వారి మీద రుద్దేస్తూ ఉంటారు.ఎందుకు ఒక చిరంజీవి పాలవాడి పాత్ర పోషించడు అని ఆయన అభిమానులు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది.పవన్ కళ్యాణ్ నిజంగా ఎంత పెద్ద హీరో అయినా హీరోయిజం అనే ఎలిమెంట్ అవసరమా అని తనను తాను ప్రశ్నించుకోవాలి.
వీరు మాత్రమే కాదు ప్రతి హీరో ఇది అర్థం చేసుకుంటే సినిమా ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది.