సింగపూర్లో భారత సంతతి వ్యక్తి చేసిన పిచ్చిపనికి కటకటాల వెనక్కి వెళ్లాడు.ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా.
తన మాజీ ప్రియురాలికి కాబోయే భర్త ఇంటి ముందు నిప్పంటించాడు.వివరాల్లోకి వెళితే… నిందితుడిని సురెంధిరన్ సుగుమారన్గా గుర్తించారు.
ఇతను అగ్నిప్రమాదం వల్ల నష్టం కలుగుతుందని తెలిసి కూడా ఉద్దేశ్యపూర్వకంగా ఈ నేరానికి పాల్పడ్డాడని కోర్ట్ దృష్టికి వచ్చింది.దీనిపై అతను నేరాన్ని అంగీకరించడంతో ఈ ఏడాది అక్టోబర్లో సురెంధిరన్ను న్యాయస్థానం దోషిగా తేల్చినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ వార్తా సంస్థ నివేందించింది.
ఈ ఏడాది మార్చి 11న నిందితుడు సురెంధిరన్.తన మాజీ ప్రియురాలిని మొహమ్మద్ అజ్లీ మొహమ్మద్ సల్లెహ్ అనే వ్యక్తి పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుసుకున్నాడు.
అంతే ద్వేషంతో, కోపంతో ఊగిపోయిన సురెంధిరన్… ఆమెకు కాబోయే భర్త నివసించే పబ్లిక్ హౌసింగ్ యూనిట్కు వెళ్లాడు.అతని ఫ్లాట్ గేట్కి తాళం వేసి మంటలు వేయడం వల్ల మొహమ్మద్ సల్లేహ్కి ఇబ్బంది కలిగించాలని అనుకున్నాడు.
అయితే సీసీటీవీ కెమెరాలలో తనను ఎవరూ గుర్తించకుండా వుండేందుకు గాను బ్లాక్ హూడీని ధరించాడు సురెంధిరన్.అనంతరం లిఫ్ట్ ద్వారా 12వ అంతస్తుకు , అక్కడి నుంచి మెట్ల ద్వారా 13వ అంతస్తుకు చేరుకున్నాడు.మొహమ్మద్ సల్లేహ్ తర్వాతి రోజు ఉదయం 8.22 గంటల సమయంలో తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా, గేటుకు తాళం వేసి వుండటంతో పాటు బూట్లు, ఇతర సామాగ్రి కాలిపోయి కనిపించింది.దీంతో భయాందోళనకు గురైన ఆయన పోలీసులకు సమాచారం అందించాడు.తుది తీర్పు సందర్భంగా న్యాయమూర్తి యూజీన్ టీయో మాట్లాడుతూ.అతని చర్య చుట్టుపక్కల నివసించేవారిని ప్రమాదంలో పడేస్తుందన్నారు.కాగా… సింగపూర్ చట్టాల ప్రకారం ఆస్తికి ఉద్దేశ్యపూర్వకంగా నష్టం కలిగించిన వారికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.