రోజురోజుకు వైసీపీ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతున్నట్టుగా కనిపిస్తుండడం , అదే సమయంలో టిడిపి, జనసేన వంటి పార్టీలు బలం పెంచుకుంటూ ఉమ్మడిగా వైసిపి ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండడం వంటి వ్యవహారాలు ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ కలవరానికి గురిచేస్తున్నాయి.పెద్ద ఎత్తున ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా.
జనాల్లో తెలియని వ్యతిరేకత వ్యక్తం అవుతుందనే విషయాన్ని నిఘా వర్గాల ద్వారా జగన్ గ్రహించారు.ప్రతి అంశం లోను తమపై పై చేయి సాధిస్తుండడం, వైసిపి తరఫున గట్టిగా కౌంటర్ ఇచ్చే నాయకులు తగ్గిపోతూ ఉండడం, అలాగే మొదటి నుంచి తనకు అండగా నిలబడుతూ.
ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడుతూ వస్తున్న చాలా మందికి ఇప్పటివరకు ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వకపోవడంతో, వారంతా అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని జగన్ గ్రహించారు. అంతేకాకుండా ఆ అసంతృప్త నాయకులు వేరే పార్టీల్లో చేరేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా వస్తున్న సంకేతాలతో జగన్ అలర్ట్ అయ్యారు.
కీలకమైన నామినేటెడ్ పోస్టులు భర్తీకి శ్రీకారం చుట్టారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే తమకు తగిన ప్రాధాన్యం జగన్ ఇస్తారని కీలకమైన పదవులను కట్టబెడతారని చాలామంది జగన్ వీర విధేయులు ఆశలు పెట్టుకున్నారు.
వారిలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఉన్నారు.ఆయన వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి జగన్ పై ఎవరు విమర్శలు చేసినా తన నోటికి పని చెబుతూ ఉండేవారు.
అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానికి ఎటువంటి పదవులు జగన్ కేటాయించక పోవడంతో ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు.ఇక సినీ నటుడు ఆలీ సైతం రాజ్యసభ సభ్యత్వం గానీ, వక్ బోర్డ్ చైర్మన్ గా కానీ జగన్ అవకాశం ఇస్తారని భావించినా.
మొన్నటి వరకు ఆయనకు ఎటువంటి పదవి ఇవ్వలేదు.

అయితే ఆలీ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారనే సమాచారం అందడంతో జగన్ ఆయనకు ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు .పోసాని కృష్ణ మురళికి తాజాగా ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.సినీ పరిశ్రమలో ఎటువంటి మద్దతు లేని సమయంలో పోసాని జగన్ తరుపున మాట్లాడుతూ ఉండేవారు.
ఇప్పుడు ఆయనకు ఈ కీలక పోస్ట్ కట్టబెట్టడం ద్వారా , తనను నమ్ముకున్న వారికి ఎటువంటి అన్యాయం చేయరనే విషయాన్ని జగన్ చాటి చెప్పినట్లు అయింది.అలాగే ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సాక్షి టీవీలో పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావును నియమించారు.
ఇక మరిన్ని భర్తీలు చేపట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండడంతో తన వీర విధేయులు అందరికీ కీలకమైన పదవులు కట్టబెట్టి ఎవరిలోనూ అసంతృప్తి లేకుండా చేసుకోవాలనే ఆలోచనతో జగన్ ముందుకు వెళుతున్నట్టుగా కనిపిస్తున్నారు.







