ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు గత కొంతకాలంగా చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు టిడిపి అండగా నిలబడుతూ.మద్దతు ఇస్తూ వస్తోంది .
ప్రస్తుతం మహా పాదయాత్ర పేరుతో అమరావతి నుంచి అరసవల్లి వరకు యాత్రను చేపట్టారు.దీనికి టిడిపి , జనసేన, బిజెపి, పార్టీలు పూర్తిగా మద్దతు తెలుపుతూ, ఆ యాత్రలో పాల్గొంటున్నాయి.
ప్రస్తుతం ఈ పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది.ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖ జిల్లాలోకి యాత్ర ప్రవేశించగానే అడ్డుకునేందుకు జేఏసీ కూడా ఏర్పడింది.
ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసిపి కి చెందిన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులంతా విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 15న విశాఖ గర్జనను ఏర్పాటు చేశారు.
సరిగా అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాని కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.15, 16 ,17 తేదీల్లో పవన్ విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో అమరావతికి మద్దతుగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు .అయితే టిడిపి సైతం అమరావతి కి మద్దతుగా నిలబడుతూనే ఉత్తరాంధ్ర , రాయలసీమలో టిడిపి పై వ్యతిరేకత లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.చంద్రబాబు సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు రూపొందించే పనిలో నిమగ్నం అయ్యారు.

ఈ మేరకు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్ తో ముందుకు వెళ్లాలని టిడిపి భావిస్తోంది.అలాగే ఈ నెల19 న పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఇక ఆ తరువాత విశాఖ కేంద్రం గా మకాం వేసి కొద్ది రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ పై వ్యతిరేకత పెరగకుండా బాబు ఆ ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు వ్యూహం రచిస్తున్నారు.మొత్తం మీద అమరావతి నినాదం ఎత్తుకోవడం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వ్యతిరేఖత రాకుండా చూసుకునే పనిలో టీడీపీ అధినేత నిమగ్నం అయ్యారు.







