అగ్ర రాజ్యం అమెరికాలో జాతి విద్వేషకర దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.ట్రంప్ హయాంలో జాతి విద్వేషం తారాస్థాయిలో ఉండేది.
తమ ఉద్యోగాలను భారత్ నుంచీ వచ్చిన మీరే కాజేసుకుంటున్నారంటూ భారత టెకీలపై దాడులు చేసేవారు.అయితే ఈ పరిస్థితి కొంత మేర అదుపులోకి వచ్చినా ఏదో ఒక మూలాన భారతీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.
బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత భారతీయులకు తన ప్రభుత్వంలో ప్రత్యేకమైన స్థానం ఇస్తూవచ్చారు.అంతేకాదు భారతీయులపై ఎలాంటి దాడులు జరిగినా సరే సహించేది లేదని హెచ్చరించారు.
అయితే ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు చేసినా సరే భారతీయలపై దాడులు మాత్రం ఆగడం లేదు…తాజాగా.
హిందూ మహిళలే టార్గెట్ గా చేసుకున్న ఓ అమెరికన్ వారిపై దాడులు చేయడం మొదలు పెట్టాడు.
పండుగలు, వేడుకల సమయంలో హిందూ మహిళలు భారతీయ సంప్రదాయం ప్రకారం చీరలు కట్టుకోవడం, నగలు ధరించడం పరిపాటే.అయితే గడిచిన కొంత కాలంగా నగలు ధరించి ఉన్న మహిళలే టార్గెట్ గా ఓ అమెరికన్ చెలరేగిపోతున్నాడు.
సుమారు రెండు నెలల పాటు హిందూ మహిళలు బయటకు వెళ్ళాలంటేనే భయపడి పోయేలా ఉన్నాయి అతడి చర్యలు.

కాలిఫోర్నియా కు చెందిన జాన్సన్ అనే వ్యక్తి ఈస్ట్ ఫాలో అనే ప్రాంతంలో ఉంటున్నాడు.రెండు నెలలుగా విలువైన ఆభరణాలు ధరించిన ఒంటరి మహిళలే టార్గెట్ గా దాడులకు పాల్పడుతున్నాడు.ఈ రెండు నెలల కాలంలో 15 మంది హిందూ మహిళలపై దాడులు చేసి భారీగా బంగారం, నగదు దోచుకున్నాడు.
భాదిత మహిళలు చేసిన ఫిర్యాదుల మేరకు స్థానిక పోలీసులు విచారణ చేపట్టి ఎట్టకేలకు జాన్సన్ ను అరెస్ట్ చేశారు.ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జాన్సన్ కు బెయిల్ రాకుండా చేస్తూ జైలు శిక్ష విధించింది.







