ఈ నెల 16వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్- 1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు.గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం పోలీస్ కమీషనర్, అదనపు కలెక్టర్లు, అధికారులతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో పరీక్షల నిర్వహణకు 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, 17366 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.పరీక్షా కేంద్రాలను 13 రూట్లుగా విభజించి ఒక్కో రూటుకు ఒక లైజన్ అధికారిని, ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక సహాయ లైజన్ అధికారిని నియమించినట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల ఏర్పాట్లు, త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్ సౌకర్యంతో పాటు ఇతర అన్ని వసతులు వుండాలన్నారు.పరీక్షా కేంద్రాల కళాశాలల ప్రిన్సిపాళ్లతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలన్నారు.
పరీక్షా కేంద్రానికి ఎలా వెళ్లాలనే రూట్ మ్యాప్ అభ్యర్థులకు తెలిసే విధంగా, ఒక రోజు ముందే పరీక్షా కేంద్రం చూసుకొనే విధంగా అవగాహన చేయాలన్నారు.ఒకే పేరు మీద ఉన్న కేంద్రాల విషయంలో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నదానిపై స్పష్టత ఇవ్వాలన్నారు.
పరీక్షా కేంద్రంలో ఏవి చేయాలి, ఏవి వద్దు అనే దానిపై అవగాహన కల్పించాలన్నారు.పరీక్షా కేంద్రంలో ప్యాడ్ కు అనుమతి లేదని, బయోమెట్రిక్ హాజరు ఉంటుంది కావున ఒక గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్థులకు అవగాహన కల్పించాలన్నారు.
డ్యూయల్ డెస్క్ లు పరిశీలించి, విరగటం, సరిగా లేనివాటి స్థానంలో మరొకటి ఏర్పాటు చేయాలన్నారు.ప్రతి సెంటర్లో అభ్యర్థుల కేటాయింపు, గదుల లే అవుట్ మ్యాప్ లు ప్రదర్శించాలన్నారు.
త్రాగునీరు, టాయిలెట్ లకు సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.సరిపోవునంతగా వెలుతురు ఉండాలని, ఫ్యాన్లు, లైట్లు చూసి, మరమ్మతులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, భద్రతా పరంగా అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేస్తామని ఆయన అన్నారు.
పరీక్షా కేంద్రంలో ఏది చెయ్యాలి, ఏది చేయొద్దు అనే దానిపై అభ్యర్థులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి, ఎన్.మధుసూదన్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవిన్యూ అధికారిణి శిరీష, అదనపు డిసిపి ఎస్.సి.బోస్, కలెక్టరేట్ ఏవో మదన్ గోపాల్, అధికారులు, ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు.అనంతరం కలెక్టర్ పరీక్షా కేంద్రాలుగా ఉన్న ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆర్జేసీ కళాశాల, ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలలను సందర్శించి తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా పార్కింగ్, టాయిలెట్స్, త్రాగునీరు2, డ్యూయల్ డెస్క్ లు పరిశీలించారు.సైన్ బోర్డుల ఏర్పాటుపై సూచనలు చేశారు.ఎంత మంది అభ్యర్థులు కేటాయించింది, ఎన్ని గదులు ఉన్నవి, సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు.