తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నో సంచలనాలకు తెర తీయబోతోంది.ముఖ్యంగా అక్టోబర్ 5వ తేదీన ఆ పార్టీ సమావేశాన్ని నిర్వహించబోతోంది.
ఈ సమావేశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ తీసుకోవడంతో కీలక నాయకులందరినీ ఆరోజు అందుబాటులో ఉండాల్సిందిగా పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి.ముఖ్యంగా పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు, జిల్లా అధ్యక్షులు క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్సీలు, ఇలా అందరిని తప్పకుండా హాజరు కావలసిందిగా ఆదేశాలు వెళ్లాయి.
ఆ తేదీన తెలంగాణలో నిర్వహించే సమావేశంలో జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లుగా టిఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.అక్టోబర్ 5 న పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, ఉదయం 11 గంటలకు ఈ సమావేశం మొదలు పెట్టనున్నారు.
మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కొత్త జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించడంతో పాటు, టిఆర్ఎస్ ను అందులో విలీనం చేయబోతున్నట్లు కేసిఆర్ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీకి సొంతంగా విమానం ఉండాలని నిర్ణయించుకున్న కేసీఆర్ ఈ మేరకు 80 కోట్లతో ఒక కొత్త చార్టెడ్ ఫ్లైట్ ను కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 5న జరగబోయే సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.దేశవ్యాప్తంగా పర్యటనల కోసమే 12 సీట్లతో ఉన్న ఉన్న చార్టెడ్ ఫ్లైట్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారట.
ఈ మేరకు ఫ్లైట్ కొనుగోలుకు విరాళాలు సేకరించాలని భావిస్తున్నారట.
ఇప్పటికే టిఆర్ఎస్ కు పార్టీ ఫండ్ 865 కోట్లు ఉన్నట్లు గతంలోనే కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో, ఇప్పుడు కొత్త ఫ్లైట్ కొనుగోలు నిర్ణయం ఆసక్తి కలిగిస్తోంది.అంతే కాకుండా అక్టోబర్ ఐదు న కేసీఆర్ నిర్వహించబోయే సమావేశంపై తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కేసీఆర్ తో కలిసి నడిచేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు.ఈ క్రమంలో కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమో, పూర్తిగా రద్దు చేసుకోవడమో చేస్తారు అని అంతా భావించినా కేసీఆర్ మాత్రం కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.