సూర్యాపేట జిల్లా:రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నేరేడుచర్లకు చెందిన సామాజిక కార్యకర్తలు సుంకరి క్రాంతి కుమార్, జింకల భాస్కర్, కొప్పు రామకృష్ణ, చింతల శ్రవణ్ మండలంలోని సోమవారం గ్రామ సోమప్పసోమేశ్వర ఆలయం వరకు పాదయాత్ర చేసి, రైతుల కొరకు ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు గత రబీ, ఖరీఫ్ పంటలలో ఎన్నో అవంతరాలు ఏర్పడి పంట నష్టపోయారన్నారు.
ప్రస్తుతం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడి దాదాపు 15 రోజులు నీరు రాక,వేసిన వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.పంటలు నష్టపోయి ఇక వ్యవసాయమే దండగనే స్థాయికి వెళ్లిన రెత్తుల కష్టాలను ఆ భగవంతుడే తీర్చాలని కోరుతూ ప్రసిద్ధి కాంచిన సోమప్ప సోమేశ్వర ఆలయం వరకు పాదయాత్ర చేశామన్నారు.
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, పదిమందికి అన్నం పెట్టే రైతు ఎప్పుడూ చల్లగా ఉండాలని, రైతులు వేసిన పంటలు బాగా పండి, పండిన పంటకు మంచి గిట్టుబాటు ధర రావాలని ఆ భగవంతున్ని వేడుకున్నట్లు తెలిపారు.