కొద్దిరోజుల క్రితం ఆసియా కప్లో భాగంగా జరిగిన టీ20 మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా విజయం సాధించడంతో యూకేలోని లీసెస్టర్ సిటీలో పాక్కు చెందిన కొన్ని ముఠాలు హిందువులు నివసించే ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించాయి.ఆసియా కప్ 2022లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించిన తర్వాత ఆగస్ట్ 28న ఈ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రోజులు గడుస్తున్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.
తాజాగా లీసెస్టర్లోని మెల్టాన్ రోడ్లో వున్న ఆలయంపై అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి.ఆలయ పరిసరాలను ధ్వంసం చేయడమే కాకుండా.
మతపరమైన జెండాను కూల్చివేశాయి.ఈ ఘటన తర్వాత ఇదే ప్రాంతంలోని ముస్లింలే లక్ష్యంగా కొందరు ఆస్తుల ధ్వంసానికి పాల్పడుతున్నారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఈ హింసాత్మక ఘటనలకు సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.గొడవకు అసలు కారణం ఏంటనే విషయం తెలియరాలేదని, దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు లీసెస్టర్ హింసపై బ్రిటన్లో భారత హైకమీషన్, బ్రిటీష్ అధికారులు, నగర మేయర్ స్పందించారు.లీసెస్టర్లో భారతీయ కమ్యూనిటీకి వ్యతిరేకంగా జరుగుతున్న హింసను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇండియన్ హైకమీషన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.దీనిపై యూకే అధికారులతో మాట్లాడుతున్నామని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు హైకమీషన్ తెలిపింది.అటు లీసెస్టర్ నగర మేయర్ పీటర్ సోల్స్ బీ స్పందిస్తూ.సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, వాస్తవాలను వక్రీకరించడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.








