అమెరికాలోని భారత సంతతికి చెందిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో దాదాపు 25 శాతం స్టార్టప్లను భారత సంతతికి చెందిన వారే నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు.
సోమవారం కాంచీపురం ఐఐఐటీడీఎం నిర్వహించిన 10వ స్నాతకోత్సవ కార్యక్రమానికి సీతారామన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.అనంతరం ఆమె ప్రసంగిస్తూ.
భారతదేశంలోని ఉన్నత విద్య ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ కంపెనీ ఎగ్జిక్యూటివ్లను తయారు చేసిందన్నారు.సిలికాన్ వ్యాలీలోని మొత్తం స్టార్టప్లలో 25 శాతం భారతీయ మూలాలున్న వారితోనే నిర్వహించబడుతున్నాయని నిర్మల గుర్తుచేశారు.
లింగం, తరగతితో సంబంధం లేకుండా యువతకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా 65 శాతం యువ శ్రామిక జనాభా భారతదేశ వృద్ధికి దోహదపడుతోందని ఆమె అన్నారు.శిక్షణ, నైపుణ్యం, వేగాన్ని కొనసాగించడం వల్లే ఇది సాధ్యమైందని నిర్మల అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 58 అగ్రశ్రేణి కంపెనీ సీఈవోలు భారతీయ మూలాలున్న, భారతదేశంలో చదువుకున్న వారేనని ఆమె తెలిపారు.
ఇక భారత్లో స్టార్టప్ల విజయం గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.విద్యార్ధులు పారిశ్రామికవేత్తలుగా మారాలని ప్రోత్సహించారు.మీలో కొందరు మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకుటున్నారని, కానీ తాను మాత్రం మీరు వ్యవస్థాపకులుగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు నిర్మల చెప్పారు.
స్టార్టప్ ఇండస్ట్రీలో 100 యూనికార్న్లకు ఇండియా కేంద్రంగా నిలిచినట్లు తెలిపారు.వీటి మొత్తం విలువ 250 బిలియన్ డాలర్లు (రూ.20 లక్షల కోట్లు)గా తెలిపారు.ఈ సంస్థలు గత కొన్నేళ్లలో 63 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.5,04,000 కోట్లు) పెట్టుబడులను సమీకరించినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.